రంగుల హోలీ
రంగుల పండుగ హోలీని అనంతపురం జిల్లాలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. చిన్న, పెద్ద, పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరూ ఆనందంగా రంగులు చల్లుకుంటూ రోడ్లపై సందడి చేశారు. జైన ఆలయాల్లో మార్వాడీలు ప్రత్యేక పూజలు జరిపారు.
ఉత్సాహాన్ని ఎద నిండా నింపుకుని, ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ‘అనంత’ జిల్లా వాసులు శుక్రవారం ఘనంగా హోలీ పండుగ జరుపుకున్నారు. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఆనందంగా గడిపారు. వివిధ రకాల రంగుల్లో మునిగితేలారు. ప్రధానంగా ఉత్తరాది వారు స్థిరపడిన ప్రాంతాలలో హోలీ సంబరాలు మిన్నంటాయి. సెలవుదినం కావడంతో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు రోడ్లపై సందడి చేశారు. డప్పులకు అనుగుణంగా మహిళలు చేసిన స్టెప్పులు అదరగొట్టాయి. నగరంలోని నాయక్నగర్లోవైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాంనాయక్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు జరిగాయి. కర్నూల్ డిప్యూటీ కలెక్టర్ బాలనాయక్, ఇతర అధికారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి రంగులు చల్లుకుని సరదాగా గడిపారు. కమలానగర్ ప్రాంతంలోని జైన్ దేవాలయంలో ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన హోలీ సంబరాల్లో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. తాడిపత్రి పట్టణం గానుగవీధిలోని దుర్గామాత, కాళికమాత ఆలయాల్లో మార్వాడీలతో కలిసి ప్రత్యేక పూజలు జరిపారు.