గోవిందా..గోపురాల దుస్థితి చూడయ్యా
-
విరిగిపోయి కళతప్పిన ప్రతిమలు -
గోపురాలపై రావి మొక్కలు -
ఆరు దశాబ్దాలు దాటినా మరమ్మతులు కరువు -
దెబ్బతిన్న మహద్వార కవచం -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకైనా సిద్ధమయ్యేనా?
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ గోపురాలు దుస్థితికి చేరుకున్నాయి. ఏడు శతాబ్దాలకు ముందు నిర్మించిన రాజగోపురాల పరిరక్షణపై టీటీడీ ఏమాత్రమూ శ్రద్ధ చూపడం లేదు. గోపురాల్లో అంతర్గతంగా ఉన్న కొయ్య త్రావాలు, బహిర్గతంగా ఉన్న ప్రతిమల మరమ్మతు పనులు ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉన్నా యి. టీటీడీ ఇంజనీరింగ్ శాఖ ప్రత్యేక చొరవ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఆలయ గోపురాలకు మరమ్మతులు పట్టదా?
ఐదువేల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోం ది. శిలాశాసనాలు, చారిత్రక ఆధారాల ప్రకా రం మహద్వార గోపురం 13వ శతాబ్దంలో నిర్మించారు. నేలమట్టం నుంచి 50 అడుగుల ఎత్తులో దశలవారీగా నిర్మించారు. మూడంతస్తుల్లో వెండివాకిలిపై నిర్మించిన గోపురం 12వ శతాబ్దంలో ప్రారంభించి 13వ శతాబ్దంలో పూర్తి చేశారు. ఇది మహద్వార గోపు రం కంటే చిన్నది.
1472 నుంచి 1482 మధ్య అంటే పదేళ్లు, 1950 నుంచి 1953 వరకు అంటే మూడేళ్లపాటు మరమ్మతు పనులు నిర్వహించినట్టు టీటీడీ వద్ద రికార్డులున్నా యి. గడిచిన అరవై ఏళ్లలో ఈ రెండు రాజ గోపురాలు మరమ్మతులకు నోచుకోలేదు. ఫలితంగా రెండు గోపురాల్లో అంతర్గతంగా ఉన్న కొయ్య రన్నర్ (త్రావము) దెబ్బతిన్న ట్టు స్వయంగా టీటీడీ ఇంజనీరింగ్ నిపుణుల పరిశీలనలో తేలింది. ఆలయ గోపురాలు, ప్రాకారాల పటిష్టత పరిశీలన కోసం టీటీడీ మాజీ ఈవో ఏపీవీఎన్ శర్మ నేతృత్వంలోని కమిటీ కూడా ఈ మరమ్మతు పనులు గుర్తిం చి సత్వరమే చేయాలని సిఫారసు చేసినా ఇంతవరకు పట్టించుకోలేదు.
ఆలయంలో ప్రాకారాలు, గోపురాలు కుంగిపోకుండా నేల పటిష్టంగా ఉందా? లేదా? అన్న పరిశోధన లు చేశారు తప్ప కట్టడాల అంతర్గత మరమ్మతుల గురించి పట్టించుకోలేదు. నిర్వహణా లోపం వల్ల ఐదు శతాబ్దాలకు ముందు నిర్మిం చిన శ్రీకాళహస్తి రాజగోపురం నాలుగేళ్లకు ముందు రెండుగా చీలి కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఏడు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ తిరుమల గోపురాల మరమ్మతులు చేయకపోతే మూల్యం చెల్లించక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విరిగిన దేవతా ప్రతిమలు
ఆలయ మహద్వారం, వెండివాకిలిపై ఉన్న రాజగోపురాలు కళ తప్పాయి. కృత, ద్వాప ర, త్రేతా, కలియుగాలకు సంబంధించిన వివిధ ఘట్టాలను తెలిపేలా దేవతామూర్తు లు, దానవులు, కళామూర్తులు, సాంస్కృతిక భంగిమలు తమిళనాడు శిల్పశైలిలో రాజగోపురాలకు రాజసం చేకూర్చాయి. ఆ ప్రతిమ లు ప్రస్తుతం కళావిహీనంగా మారాయి. ఏళ్లతరబడి మరమ్మతులు చేయలేదు. గోపురాలపై రావి మొక్కలు పెరిగాయి. తద్వారా గోపురాలు, మహద్వారం దెబ్బతిన్నాయి. ద్వారానికి భక్తుల చేతులు రాపిడి వల్ల దాని కవచాలు కూడా దెబ్బతిన్నాయి. ఇదే పరిస్థితి లో గొల్లమండపం ఉంది. ప్రతిసారీ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు తెలుపుసున్నం కొట్టి ఇంజనీరింగ్ శాఖ చేతులు దులుపుకుం టోంది. ఈ బ్రహ్మోత్సవాల లోపైనా మరమ్మ తులు చేయాలని భక్తులు కోరుతున్నారు.