ఇక పాలన మొత్తం ఐప్యాడ్ల ద్వారానే!!


రాబోయే కాలంలో పాలన మొత్తం ఐప్యాడ్ల ద్వారానే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఐప్యాడ్లు ఇచ్చామని, త్వరలోనే ఐఏఎస్ అధికారులకు కూడా వాటిని ఇస్తామని ఆయన అన్నారు. తర్వాత క్రమంగా జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులకు కూడా వీటిని అందజేస్తామన్నారు. అలా క్రమంగా మొత్తం పాలనా వ్యవహారాలన్నింటినీ ఎలాంటి పేపర్లు అవసరం లేకుండా ఐప్యాడ్ల ద్వారా చేస్తామన్నారు.



అక్టోబర్ రెండో తేదీ నుంచి జన్మభూమి-మాఊరు కార్యక్రమం నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆధార్ సీడింగ్ వల్ల సంక్షేమ పథకాల్లో 20 శాతం వరకు నిధులు ఆదా అవుతున్నాయని, 65 లక్షల మందికి చెందిన రేషన్ ఇన్నాళ్లుగా పక్కదారి పడుతోందని ఆయన అన్నారు. 2.62 లక్షల పింఛన్లకు ఆధార్ సీడింగ్ కాలేదని, వాళ్లంతా ఇక తమకు పింఛన్లు రావని భావిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రులకు రావాలంటేనే జనం భయపడుతున్నారని, ఆస్ప్రత్రిలో పనిచేసే ఉద్యోగులు, డాక్టర్లు కూడా వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చుచేసే నిధుల్లో 50 శాతం ప్రభుత్వాస్పత్రులకు వచ్చి ఉంటే చాలా మేలు జరిగేదని ఆయన వ్యాఖ్యానించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top