పడిగాపులే..


నెల్లూరు (నవాబుపేట), న్యూస్‌లైన్ : మనుబోలు రైల్వేస్టేషన్లో క్రాసింగ్ వద్ద గురువారం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో నెల్లూరు మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దు కావడంతో పాటు మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

 

  చెన్నైకి వెళ్లే మెమో యూనిట్‌ను రద్దు చేశారు. దీంతో నెల్లూరులోని ప్రధాన రైల్వేస్టేషన్‌లోనే మెమో రైలు నిలిపివేశారు.

 

 గూడూరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. అలాగే తిరుపతి-సికింద్రాబాద్ మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌తో తిరుమల, శేషాద్రి, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు.

 

 నెల్లూరు నుంచి బయల్దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్ వేదాయపాళెంలో రెండున్నర గంటలకు పైగా నిలిచి పోయింది. 8.50 గంటలకు లైన్ క్లియర్ చేసి రైలుకు పచ్చజెండా ఊపారు. తిరువనంతపురం వెళ్లే త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్, విజయవాడ-చెన్నై మధ్య నడిచే జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్, అసన్‌సోల్-చెన్నై మ ధ్య నడిచే చెన్నై ఎక్స్‌ప్రెస్, ఆదిలాబాద్-తిరుపతి మధ్య ప్రయాణించే కృష్ణా ఎక్స్‌ప్రెస్, చెన్నై-హైదరాబాద్ మధ్యనడవాల్సిన హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్,  ఎగ్మోర్-కాకినాడ మధ్య నడిచే సర్కార్ ఎక్స్‌ప్రెస్, కొల్లం, కేరళా ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడిచాయి.

 

 దీంతో ప్రయాణికులు ప్రధాన రైల్వేస్టేషన్‌లో రైళ్ల కోసం వేచి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.   రైళ్ల రద్దు, ఆలస్యం తదితర వాటిపై సమాచారం తెలిపేందుకు రైల్వే స్టేషన్ మాస్టర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టికెట్ల రద్దుకు అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని  డిమాండ్ చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top