దేవుడు మాకు న్యాయం చేశాడు: షర్మిల


సాక్షి, హైదరాబాద్ : ‘దేవుడు మాకు న్యాయం చేశాడు...జగనన్నకు బెయిల్ వచ్చింది..’ అని జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల వ్యాఖ్యానించారు. ‘ఒక్క జగన్‌కు మాత్రమే బెయిల్ రావడం కాదిది... కోట్లాదిమంది రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించే అంశం.. వారంతా ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు..’ అంటూ ఆమె సోమవారం నాడిక్కడ స్పందించారు.



కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్‌ను అణగదొక్కాలని చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌తో పార్టీకి ప్రమాదమని భావించిందనీ, పెద్ద సవాలుగా తయారవుతారనే ఉద్దేశంతో సీబీఐ ద్వారా కేసులు పెట్టి వేధించిందని తెలిపారు. పార్టీకి వైఎస్ 30 ఏళ్లు చేసిన సేవలను మర్చిపోయి ఆయన కుటుంబాన్ని వేధించడానికి కాంగ్రెస్ పూనుకుందన్నారు.



‘వైఎస్ వంటి బలమైన నాయకుని మరణం తరువాత ఇంత పెద్ద రాష్ట్రం జగన్ చేతుల్లోకి వెళ్లి పోవడం ఆ పార్టీకి ఇష్టం లేదు. ఎలాగైనా తమ పట్టు కొనసాగాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడింది..’ అని వివరించారు. కానీ దేవుని వల్లనే ఈరోజు ఈ అద్భుతం జరిగిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.



జగన్ విడుదలతో వైఎస్సార్ కాంగ్రెస్ పునరుజ్జీవం పొందిందనీ, వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అత్యధిక స్థానాలు గెల్చుకుంటుందని చెప్పారు. కేంద్రంలో కూడా నిర్ణయాత్మక పాత్రను నిర్వర్తిస్తుందన్నారు. తెలంగాణ, కోస్తా, రాయలసీమ.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌కు అపారమైన ప్రజాభిమానం ఉందని తెలిపారు. ఆ విధంగా కోట్లాది మంది ప్రజల హృదయాల్లోకి పార్టీ వెళ్లిందని షర్మిల చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top