ఈతకు వెళ్లి ఇద్దరు మృతి


అచ్చంపేట (గుంటూరు): గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం అంబడిపూడి గ్రామ సమీపంలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. గ్రామ సమీపంలోని కృష్ణానదిలో ఈతకు వెళ్లిన దివ్య రాజు (19), కిరణ్‌కుమార్ (19) అనే ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఉదయం గల్లంతయ్యారు. కొద్ది సేపటి తర్వాత మునిగిపోయిన వారి మృతదేహాలను పడవల వాళ్లు వెలికి తీశారు.



వివరాలు.. గ్రంధసిరి గ్రామానికి చెందిన బి.బాబు కుమారుడు దివ్యరాజు, చిల్కాట్ మోహన్ రావు కుమారుడు కిరణ్ కుమార్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం సెలవు కావడంతో అచ్చంపేట మండలంలో అంబడిపుడి గ్రామంలో ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్లారు. గ్రామ సమీపంలో కృష్ణా నది ఉండటంతో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లారు.



వీరు ఈత కొట్టడానికి దిగిన చోట ఎత్తిపోతల పథకం నిర్మాణానికి తీసిన గోతులు ఉన్నట్లు తెలియకపోవడంతో వీరు మునిగిపోయారు. వీరితో పాటు వచ్చిన స్నేహితుడు చిల్కాట్ కాలేబు ఒడ్డున ఉన్నాడు. ఈత రాకపోవడంతో స్నేహితులు మునిగిపోతున్నా ఏమీ చేయలేక నిస్సహాయస్థితిలో కేకలు వేశాడు. స్థానికులు వచ్చేసరికి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top