‘ఆ మాటకు ఉలికిపడుతున్నారు’
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ ప్లీనరీ విజయవంతమైందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన 9 హామీలు టీడీపీ నాయకుల్లో వణుకు పుట్టిస్తున్నాయని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్న వస్తున్నాడు అన్న మాటకు టీడీపీ నేతలు ఉలికి పడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రులు ప్రజాసంక్షేమాన్ని మరిచి జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర శ్రేయస్సును మర్చిపోయి ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై జగన్ స్పందిస్తున్నారని తెలిపారు.
డబ్బు రాజకీయాలు నడపడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం సీఎం చంద్రబాబుకు అలవాటని పేర్కొన్నారు. ప్రజస్వామ్యాన్ని దిగజార్చి, రాజకీయ వ్యవస్థను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రజల మద్దతు ఉందనే విశ్వాసం ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్నారా?, మూడేళ్లలో ఒక్కసారైనా ఒక్క హామీనైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం విచ్చలవిడిగా తాయిలాలు ప్రకటిస్తున్నారని ఆరోపించారు. నంద్యాల ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బాబు హామీలకు ఎవరు మోసపోరని అన్నారు. నంద్యాలో అధికార పార్టీ అక్రమాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని శ్రీకాంత్రెడ్డి తెలిపారు.