‘స్వచ్ఛ తిరుపతి’కి నిధులు తెస్తా


తిరుపతి కార్పొరేషన్ : స్వచ్ఛ తిరుపతి కోసం చేపడుతున్న ప్రణాళికలు బాగున్నాయని, అందుకు కావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తిరుపతి ఎంపీ వరప్రసాద్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ‘స్వచ్ఛ తిరుపతి’లో భాగంగా చేపడుతున్న ప్రణాళికలను ఎంపీ ఆదివారం ఎన్‌జీఓ కాలనీలో పర్యటించి పరిశీలించారు. దీంతో కమిషనర్ వినయ్‌చంద్ ఆదేశాల మేరకు ప్రజా సంబంధాల అధికారి కేఎల్.వర్మ ఎంపీతో మాట్లాడారు. స్వచ్ఛ తిరుపతికి కార్పొరేషన్ చేపడుతున్న చర్యలను ఎంపీకి వివరించారు. స్వచ్ఛ తిరుపతిలో భాగంగా మొదటి దశలో గిరిపురం, వరదరాజనగర్, ఎన్‌జీఓ కాలని, జర్నలిస్టు కాలనీ, అంబేద్కర్ కాలనీలను మొత్తం 5 స్మార్ట్ వార్డులను ఎంపిక చేశామన్నారు.



ఒక్కో వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా చెత్త నిర్వహణ, రోడ్లు, కాలువలు పనితీరు, సిబ్బంది చేస్తున్న పనులు, వారి సమస్యలను ఎంపీ స్వయంగా పరిశీలించారు. కార్మికులు సమస్యలను తాను పరిష్కరిస్తానని, వారు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పని చేయాలని సూచించారు. స్వచ్ఛ తిరుపతికి అవసరమైన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైన నిధులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్‌వైజర్ చెంచయ్య, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top