యూరియా కోసం అగచాట్లు
గూడూరులో రైతుల తొక్కిసలాట.. పోలీసుల జోక్యం
గూడూరు:
పక్క ఫొటోలో క్యూలో నిలబడింది సినిమా టికెట్ల కోసం అనుకుంటే పోరపాటే. వీరంతా అన్నదాతలు. ఎరువుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయాలు చేపడుతుండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ క్రమంలో సోమవారం స్థానిక ప్రభుత్వ సహకార సొసైటీకి ఒక లారీలో 15 టన్నుల యూరియా బస్తాలు రావడంతో రైతులు బారులు తీరారు. యూరియాను దక్కించుకునెందుకు పట్టాదారు పాసు పుస్తకాలను చేతిలో పట్టుకుని మహిళా రైతులు సైతం ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో టోకన్ల కోసం కౌంటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. వృద్ధులు, మహిళలు కింద పడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
పలుకుబడి ఉన్నోళ్లకే టోకెన్లు..
సహకార సొసైటీలో పలుకుబడి ఉన్న వారికే యూరియా కోసం పంపిణీ చేసే టోకెన్లు లభ్యమవుతున్నాయి. ఉదయం నుంచి కార్యాలయం వద్ద పడిగాపులు కాసిన వారికి టోకన్లు అందడం లేదు. పైరవీకారులకు పది నిమిషాల్లో యూరియా మంజూరవుతోంది. డబ్బులు ఎక్కువ ఇచ్చిన వారికి సొసైటీ ఇన్చార్జ్ టొకన్లు ఇస్తున్నారని క్యూలో ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచికలపాడు గ్రామానికి చెందిన కొంత మంది రైతులు తమకు ఇచ్చిన 30 బస్తాల యూరియాను సమీపంలో పోగు చేసుకోవడంతో మిగతా గ్రామాల వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల రైతులు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురికి సర్ధిచెప్పారు. ఒక దశలో సోసైటీ ఇన్చార్జ్ సత్యనారాయణతో అన్నదాతలు వాగ్వాదానికి దిగారు. రేపటికంతా మరో రెండు లారీల ఎరువులు వస్తాయని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.