హోదా కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు
తొండూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తొండూరులో నంద్యాల రామనాథరెడ్డి(30) అనే యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. శనివారం ఓ వైపు బంద్ సాగుతుండగా ఉదయం 10 గంటలకు తొండూరు బస్టాండు సమీపంలోని సెల్ టవర్ వద్దకు చేరుకున్న రామనాథరెడ్డి చకచకా పైకి ఎక్కాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది టవర్ వద్దకు చేరుకున్నారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రైతులు, విద్యార్థులు, పేద ప్రజలు ఎంతో నష్టపోతారని పైనుంచి నినాదాలు చేశాడు. పోలీసులు చాలా సేపు బుజ్జగించినా కిందకు దిగలేదు. విషయాన్ని జిల్లా కలెక్టర్కు చేరవేశారు. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించామని, హోదా వస్తుందని పోలీసులు చెప్పడంతో కిందకు దిగి వచ్చాడు.