ఏపీలో కొత్తగా ఐదు శిల్పారామాలు
తెలంగాణలో ఒక్క హైదరాబాద్లో మాత్రమే శిల్పారామం ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి ఐదు ప్రాంతాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇప్పటికే ఉన్నవాటికి అదనంగా కాకినాడ, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, అనంతపురాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
దీంతోపాటు శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో పర్యాటక సర్క్యూట్లు ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. దాంతో పాటు పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెంలో బీచ్ రిసార్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, ఆతిథ్య రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా కాకినాడ, తిరుపతిలలో 12 కోట్ల రూపాయలతో ప్రభుత్వ రంగంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నెలకొల్పుతామన్నారు.