తెలుగు తమ్ముళ్ల తన్నులాట
పార్టీ ఆవిర్భావం రోజే రెండు జిల్లాల్లో వర్గాల బాహాబాహీ
అనంతపురం/తాళ్లూరు: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే ఆదివారం రెండు జిల్లాల్లో తెలుగు తమ్ముళ్ల విభేదాలు భగ్గుమన్నాయి. కుర్చీలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. రక్తం కారేలా కొట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలోనే రెండువర్గాల వారు తలపడ్డారు. అనంతపురం ఎమ్మెల్యే, మేయర్ వర్గాలు కలబడ్డాయి. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.
అనంతపురంలోని క్రీసెంట్ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి అధ్యక్షతన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే, మేయర్ వర్గాలు గొడవ పడ్డాయి. కాగా ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పుగంగవరంలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని మంత్రి శిద్దా రాఘవరావు ప్రారంభిస్తుండగా వివాదం రేగింది.