కూతురి పెళ్లి ఆగిపోయిందని..


అనంతపురం : కూతురి పెళ్లి ఆగిపోయిందనే మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామానికి చెందిన గనప్ప(45) కూతురి వివాహం డోర్నకల్ మండలానికి చెందిన యువకుడితో నిశ్చయమైంది. ఈ క్రమంలో పెళ్లి పనుల్లో మునిగిపోయిన గనప్పకు ఓ చేదు నిజం తెలిసింది. తన కూతురు మరో యువకుడిని ప్రేమించిందని, ఆ యువకుడు కాబోయే పెళ్లి కొడుక్కి ఈ విషయం చెప్పడంతో.. మగ పెళ్లివారు వివాహాన్ని నిరాకరిస్తున్నారని తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన గనప్ప సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.



అప్పటి నుంచి కుటుంబసభ్యులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా శుక్రవారం వేల్పుమడుగు గ్రామ శివారులో గొర్రెలను మేపుతున్న కాపరులకు ఓ మృతదేహం కనిపించడంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన గనప్ప కుటుంబ సభ్యులు మృతదేహన్ని గనప్పదిగా గుర్తించి బోరుమన్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతోపాటు పక్కన పురుగులమందు డబ్బా ఉండటంతో ఇంట్లో నుంచి వెళ్లిన రోజునే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top