ఎలుగుబంటి దాడిలో రైతు మృతి
అర్ధవీడు (ప్రకాశం జిల్లా): కుంటలో నీరు తాగేందుకు వెళ్లిన రైతుపై ఎలుగుబండి దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బోమిలింగం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రామాంజనేయులు(30) పొలంలో అరక దున్నేందుకు వెళ్లాడు. కాగా, సాయంత్రం దప్పిక కావడంతో పక్కనే ఉన్న కుంటలో నీరు తాగేందుకు వెళ్లాడు.
అయితే, అక్కడే ఉన్న ఎలుగుబంటి రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.