బడుగు రైతుపై పోలీసుల ప్రతాపం
బేతంచెర్ల (కర్నూలు) : ఓ వ్యక్తి పోలీసు దెబ్బలకు తాళలేక తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం రుద్రవరంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి తల్లి నాగమ్మ, భార్య పెద్ద లక్ష్మీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రవరం గ్రామానికి చెందిన రైతు తలారి పెద్ద మద్దిలేటి సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటి ఆవరణలో అరుస్తున్నాడు. అదే సమయంలో గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు అతడిని గ్రామంలోని ఆలయం వద్దకు తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు. కదల్లేనిస్థితిలో ఉన్న పెద్ద మద్దిలేటిని కుటుంబసభ్యులు మంగళవారం ఉదయం ఇంటికి తీసుకెళ్లారు.
అయితే పోలీసులు మళ్లీ వెళ్లి బేతంచెర్లకు రావాలని బాధితుడికి హుకుం జారీ చేశారు. తీవ్రంగా భయపడిన అతడు ఫిట్స్తో పడిపోయాడు. దీంతో 108 వాహనంలో బేతంచెర్ల ఆస్పత్రికి, అనంతరం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన భర్తకు ఇంతకుమునుపు ఎప్పుడూ ఫిట్స్ రాలేదని, పోలీసుల దెబ్బలకు భయపడి ఫిట్స్ వచ్చాయని భార్య అంటోంది. ఈ విషయమై సీఐ సుబ్రమణ్యంను వివరణ కోరగా గ్రామంలో జరిగిన ఘటన తీరుపై విచారిస్తున్నామన్నారు.