దారుణంగా మోసపోయింది.. 'మా గోదారే' !
తణుకు : తప్పుడు హామీలిచ్చిన గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడుకు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు దీక్షలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ 'రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో దారుణంగా మోసపోయినవారు మన జిల్లా ( పశ్చిమ గోదావరి)లోనే ఎక్కువమంది ఉన్నారు. వారందరి కన్నీరు తుడవటానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి, సీఎం మెడలు వంచటానికి మనందరి నాయకుడు వైఎస్ జగన్ ( శనివార) దీక్ష చేపట్టి మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్న జగన్కు ప్రజలందరి తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.
ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు మాటలు నమ్మి జిల్లా ప్రజలు టీడీపీకి అత్యధిక ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలు కట్టబెట్టారు. గెలిచిన తరువాత ఇచ్చిన హామీలను మరచిన వ్యక్తి చంద్రబాబు. ఎన్నికల తరువాత కూడా ప్రజలతో కలిసి ఉన్న వ్యక్తి మన జగన్. చంద్రబాబు వాగ్దానాలకు దారుణంగా మోసపోయిన ప్రజలు ఇక్కడే (దీక్షలో) ఉన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఈ 7 నెలల కాలంలోనే 5, 6 సార్లు పశ్చిమ గోదావరికి వచ్చారు. వాగ్దానాల అమలు విషయంలో ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తే.. ఆయన మాత్రం సిగ్గు లేకుండా వెళ్లిపోయారు. మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు' అన్నారు.