ప్రజాస్వామ్యంపై నమ్మకం మరింత పెరిగింది
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ప్రజాభిప్రాయం తేటతెల్లమైందని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంపై నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు. జీడీపీ విషయంలో ప్రభుత్వం సభను తప్పుదారి పట్టిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీ సాక్షిగా ప్రజల చెవుల్లో పూలు పెట్టాలని చూస్తున్నారని అన్నారు.
ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు రాయలసీమ (చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం), పశ్చిమ రాయలసీమ (అనంతపురం, కడప, కర్నూలు) శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఫలితాలు వెలువడాల్సివుంది. పశ్చిమ రాయలసీమ(చిత్తూరు, అనంతపురం) ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి ముందంజలో ఉన్నారు.