ఆలస్యంగా వచ్చినందుకు మోకాళ్ల దండన
విజయనగరం (గుమ్మలక్ష్మీపురం): సంక్రాంతి సెలవులకు ఇంటికెళ్లి ఆలస్యంగా వచ్చినందుకు విద్యార్థులకు మోకాళ్ల దండన విధించాడో ఓ తెలుగు మాస్టారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని పామిటి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వచ్చినందుకు రూ.160 ల జరిమానా చెల్లించండి. లేదంటే గ్రౌండు చుట్టూ మోకాళ్లపై ఆరు రౌండ్లు నడవాలని ఎం.రవి అనే తెలుగు మాస్టర్ విద్యార్థులకు శిక్ష విధించాడు.
డబ్బులు ఉన్న వారు ఫైన్ కట్టారు. లేనివారు మోకాళ్లపై నడిచారు. మోకాళ్లపై జనవరి 26 నుంచి రెండు రోజుల పాటు గ్రౌండ్ చుట్టూ నడవడంతో అశ్విని అనే గిరిజన బాలిక ఆదివారం అస్వస్థతకు గురైంది. దీంతో బాలికను పార్వతీపురం ఆసుపత్రిలో చేర్చారు. ఈ నిర్వాహకంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. బాలికల తల్లిదండ్రులు ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.