బడ్జెట్పై నేతల్లో తీవ్ర అసంతృప్తి
విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్పై తెలుగుదేశం, వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు బీజేపీ ప్రభుత్వ తీరును సున్నితంగా విమర్శించేందుకు ప్రయత్నించారు. ఈ బడ్జెట్తో రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదని విజయవాడ ఎంపీ కేశినేని చెప్పారు. రూ.17 లక్షల కోట్ల బడ్జెట్లో రూ.13 లక్షల కోట్లు నాన్ ప్లానింగ్ బడ్జెట్ అని.. తరువాత దీనిని ఎలాగైనా మార్చుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తంచేశారు. తమ పార్టీ తరఫున కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి రావాల్సిన రాయితీలు వచ్చేలా చూస్తామన్నారు.
రాజధాని పేరుతో రైతులను తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేసిందని, పచ్చని భూములు లాక్కుని వారిని పేదలుగా మార్చిందని, ప్రపంచస్థాయి రాజధాని అంటూ ఊరించి చివరకు అక్కడి వారందరినీ దిక్కులేని వారిని చేస్తున్నదని మొదటి నుంచీ వ్యాఖ్యానిస్తున్న వైఎస్సార్సీపీ బడ్జెట్లో కేంద్రం రాజధానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం చూస్తే టీడీపీ, బీజేపీల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని గమనించవచ్చని పేర్కొంటోంది. బీజేపీ నేతలు మాత్రం ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ ఉందని చెబుతున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ ఎన్నికల్లో వారి పార్టీకి పెట్టుబడులు పెట్టినవారికి ఉపయోగపడేదిగా ఉందన్నారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని చెప్పారు. సీపీఎం వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.