బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఇద్దరి మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
విశాఖ జిల్లాలో ప్రమాదం
రాంబిల్లి: విశాఖ జిల్లా రాంబిల్లి మండలం నారాయణపురంలో అనధికార బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం పేలుడు జరిగి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన భూపతి వెంకటరమణ అనధికారికంగా బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు. అందులో బాంబులు తయారు చేస్తూ ఉదయం 11.30 గంటల సమయంలో సమీపంలో ఉన్న ఇంటికి వెళ్లాడు.
ఆ సమయంలో వెంకటరమణ కుమారులు నాగదుర్గ (24), శివకుమార్ (18), అతడి సోదరుడి కొడుకు జీవన్ (15), గ్రామానికి చెందిన యర్రంశెట్టి గణేష్ బాంబులు తయారు చేస్తున్నారు. వెంకటరమణ వెళ్లిన అర్ధగంటకు ఒక్కసారిగా బాంబులు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో జీవన్, గణేష్ మృతిచెందారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న శివకుమార్, నాగదుర్గల పరిస్థితి విషమంగా ఉంది.