పంటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు
పుంగనూరు(చిత్తూరు): మత్తుమందుల్లో వాడే గసగసాలను పంటను పుంగనూరు పరిసర గ్రామాల్లో పండించారు. ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో రెవెన్యూ పోలీసులు దాడిచేసి సుమారు రూ.50 లక్షల విలువ చేసే పంటను ధ్వంసం చేశారు. పంటను పండించిన 81 మందిపై కేసు పెట్టారు. ఈ పంటను మత్తుమందుల్లో వాడతారని తెలియక సుమారు 1500 మంది రైతులు ఈ పంటను 4 వేల ఎకరాల్లో సాగుచేశారు. వీటి విలువ సుమారు రూ.10 కోట్లు. ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను ధ్వంసం చేస్తుంటే రైతులు లబోదిబోమంటున్నారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఈ ప్రాంతంలో 5 సంవత్సరాలుగా పంట పండిస్తున్నారు కానీ అప్పుడు ఎటువంటి కేసు పెట్టలేదు. రైతులు తెలియక వేసిన పంట కాబట్టి నష్టపరిహారం చెల్లించి పెట్టి కేసులను ఎత్తి వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతులపై కేసులు నమోదు చేస్తే పుంగనూరులో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో ఏడు రోజుల నుంచి ఈ పంటలను ధ్వంసం చేస్తున్నారు.