అంతా గందరగోళం!

అంతా  గందరగోళం!


సేకరించనున్న భూమి 5380ఎకరాలు

 వచ్చిన అభ్యంతరాలు 2,506

 పరిశీలనకు వెళ్లినవారు 500

 భూములు అమ్ముకున్న వారి నుంచి వచ్చిన అభ్యంతరాలు   50పైగా

 వేరే వారి పేరుమీద ఉన్న భూములు 65శాతం

 భూములు ఒకరివి, అభ్యంతరాలు వేరొకరివి, ఆన్‌లైన్‌లో  మరొకరి పేరు

 ఆందోళన చెందుతున్న భోగాపురం మండల వాసులు

 ఎవరి పేరున భూములున్నాయో తేల్చకుండా

  సర్వేలేంటని ప్రశ్నిస్తున్న నిర్వాసితులు

 అభ్యంతరాల పరిశీలనకు గడువు డిసెంబర్ 7

  పేర్లు తారు మారు కావడంతో హాజరు కాని రైతులు


 

 భోగాపురం మండల వాసులకు ఇప్పుడు మరో భయం పట్టుకుంది. ఇంతవరకూ ప్రభుత్వం తమ భూములు  లాక్కోకుండా  ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళ నకు గురైన వారికి ఇప్పుడు మరో విపత్తు ఎదురైంది. చాలా మంది భూములు వారిపేరుపై లేకపోవడంతో కనీసం పరిహారమైనా  దక్కుతుందో ? లేదో? అన్న భయాందోళన వారిని వెంటాడుతోంది.

 

 ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు ఎరుసు తోటమ్మ. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో ఈమె భూమి కూడా ఉంది. భోగాపురం మండలం దళ్లిపేట సర్వే నంబర్ 210లో 13,22,25 నంబర్లతో ఈమె కు 1.20 ఎకరాల భూమి ఉంది. భూములను తీసుకుంటున్నామని 60రోజుల్లోగా అభ్యంతరాలను ఇమ్మం టే ఈమె తన అభ్యంతరాన్ని తెలియజేసింది. అభ్యంతరం ఇచ్చినందున ఈమెకు నోటీసు ఇచ్చి అభ్యంతరాలకు సంబంధించిన పూర్తి  వివరాలు ఇవ్వమన్నారు. భర్త మృతి చెందడంతో భూములు ఈమె పేరున మారలేదు.  కుమారుడు తోటయ్యకు కూడా బదలాయించలేదు. పోనీ మార్చుదామంటే తోటమ్మ భర్త సూరి పేరునా ఈ భూములు లేవు. చివరకు ఆరా తీస్తే ఆమె భర్త అన్న నర్సింహ  పేరున వీరు సాగు చేస్తున్న భూములున్నాయి.

 

 

   ఈ పక్క చిత్రంలో ఉన్న  మహిళ రాములమ్మ భర్త  చినపల్లి బంగారయ్య పేరున ఉండాల్సిన భూములు వేరే వ్యక్తి బాలయ్య పేరున ఉన్నాయి. అయితే అభ్యంతరం వ్యక్తం చేసింది మాత్రం బంగారయ్య. బాలయ్య పేరున   భూములున్నాయని నోటీసు  మీకు వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

 

 మా జీవితాలతో ఆడుకుంటున్నారు.

 చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మా అందరి జీవితాలతో ఆడుకుంటోంది. భూముల రికార్డులు సక్రమంగా లేకుండా మాకు నోటీసులు ఇవ్వడమేమిటి? ఇప్పటికే చాలా మంది చనిపోయారు. ఇప్పుడు వేర్వేరు రికార్డులు, ఆన్‌లైన్‌లతో  రైతుల్లో గందర గోళం సృష్టిస్తున్నారు. ఇది అన్యాయం. 50 ఏళ్ల కిందటి రికార్డులు కూడా మార్చకుండా   భూములు లాక్కుంటామనడం ఎంతవరకు సమంజసమో   అధికారులు, ప్రభుత్వమే చెప్పాలి.

                                                                              -  దళ్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్

 

 డిసెంబర్ 7 వరకూ

 అభ్యంతరాల పరిశీలన


 భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి భూ సేకరణ నోటిఫికేషన్ అభ్యంతరాలకనుగుణంగా నోటీసులు ఇచ్చాం. వారు వచ్చి అభ్యంతరాల వివరాలను అందివ్వాల్సి ఉంది. తాపీగా వస్తున్నారు. మూడు యూనిట్లలో వివిధ తేదీలను ఖరారు చేసి డిసెంబర్ ఏడు నాటికి పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది. తప్పొప్పులను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

                                                                                                    -బాలా త్రిపుర సుందరి,

 

 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్,


 విజయనగరం కంటోన్మెంట్: భోగాపురం ఎయిర్‌పోర్టుకు సేకరించాలని భావిస్తున్న 5,380 ఎకరాల్లో దాదాపు 65 శాతం పైగా ఇదే పరిస్థితి. భూములు ఒకరి పేరున ఉంటే అభ్యంతరాలు వేరొకరు ఇచ్చారు.   నోటీసులు అందుకున్న వారు వెళ్లి పరిశీలన చేస్తే భూములు వేరొకరి పేరున ఉన్నాయి.  ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం విశేషం. భోగాపురంలో ఒకప్పుడు బాగా భూములున్న వెలువర్తి సూర్యప్రకాశరావు కుటుంబానికి గ్రామంలో ఇప్పుడు భూములు లేవు. దాదాపు 50 ఏళ్ల కిందట భూములను అమ్మేసి వెళ్లిపోయారు. అయితే వారి పేరున కూడా నోటీసులు వచ్చాయి.   ఎప్పుడో భూములమ్మేసి వెళ్లిపోయిన వారు అభ్యంతరాలను ఇవ్వడంతో కొంత మంది గ్రామస్తులు ఆరా తీస్తున్నారు. తొమ్మిది గ్రామాల్లోనూ భూముల వివరాలను తాజా పర్చకపోవడం వల్ల  అందరిలో ఆందోళన నెలకొంది. అసలే భూములు లాక్కుంటున్నారని ఆందోళన ఉన్న గ్రామస్తులకు, తమ భూములు వేరొకరి పేరున  ఉన్నాయని తెలిసి  మరింతంగా భయపడుతున్నారు.  ఒక వేళ ప్రభుత్వం తమ భూములు తీసుకుంటే తమకు రావలసిన పరిహారం అందకుండా పోతుందేమోనని భయపడుతున్నారు.  దీంతో వారంతా భూ సేకరణ కార్యాలయానికి వెళ్లి మా భూములు ఇవ్వడం ఇవ్వకపోవడం వేరే! ముందు మా రికార్డులు తాజా పర్చండని వేడుకుంటున్నారు.

 

 65 శాతం వేరే పేరున


 భోగాపురం మండలంలోని కౌలువాడ, రావాడ, ముంజేరు, ఏ రావి వలస, సవరవిల్లి, కొంగవాని పాలెం, కంచేరు గ్రామాల్లో గూడెపు వలస, దళ్లిపేట గ్రామాల్లో సేకరించేందుకు సర్వే చేస్తున్న భూముల్లో దాదాపు 65 శాతం భూములు ఇతరుల పేరున ఉన్నాయి. దీని వల్ల ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ముందుగా భూములు సక్రమంగా తాజా పర్చకుండా ఈ భూ సేకరణ నోటిఫికేషన్ ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.  

 

 వచ్చిన అభ్యంతరాల

 పరిశీలనకు గడువు డిసెంబర్ 7


 అభ్యంతరాల పరిశీలనకు డిసెంబర్ ఏడు వరకూ గడువునిచ్చారు. గడువులోగా అభ్యంతరాల పరిశీలనకు పూర్తి స్థాయిలో ఎవరూ వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీనికి కారణం గందరగోళంగా భూముల రికార్డులు ఉండటమే.  ఎయిర్‌పోర్టుకు అవసరమైన  భూములను సేకరించేందుకు నోటిఫికేషన్‌ను ఇచ్చిన 60 రోజుల్లోగా అభ్యంతరాలను స్వీకరించేందుకు గడువునిచ్చారు. దీంతో పెద్ద ఎత్తున అభ్యంతరాలను అందజేశారు. భూ సేకరణ యూనిట్లకు సంబంధించిన మూడు యూనిట్లకు 2,506 అభ్యంతరాలు వచ్చాయి. యూనిట్-1కు 840, యూనిట్-2కు 678, యూనిట్-3కి 988 అభ్యంతరాలు వచ్చాయి. అయితే అభ్యంతరాల పరిశీలనకు మాత్రం కేవలం 500 మంది మాత్రమే   వచ్చి తమ వివరాలను, అభిప్రాయాలను అందజేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top