వెళితే వైజాగ్...లేదా చలో తిరుపతి
► రాజధానిలో ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ సమస్య
► ప్రొఫెషనల్ కోర్సుల రిజిస్ట్రేషన్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లేదు
► అంత దూరం వెళ్లలేక ఎంప్లాయిమెంట్ చేయించుకోని వైనం
పేరు గొప్ప... ఊరు దిబ్బ... అన్న చందాన ఉంది మన రాజధాని అమరావతి. పాలకుల డాంబికాలు తప్ప ఇక్కడ కనీసం ప్రొఫెషనల్ కోర్సులు చదివిన విద్యార్థులు ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పటికైనా వస్తాయని కొండంత ఆశతో ఎదురుచూసే వారు ఎంప్లాయిమెంట్ కోసం అటు వైజాగో...ఇటు తిరుపతో వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. చిన్నా, చితకా ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారు సెలవులు దొరక్క, అంతదూరం వ్యయప్రయాసలకోర్చి వెళ్లలేక ఎంప్లాయిమెంట్ చేయించుకోవడం మానివేస్తున్నారు. ఇదీ... మన ఘనత వహించిన రాజధాని...
నెహ్రూనగర్ (గుంటూరు) : రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో బీటెక్, ఎంబీఏ, ఎంబీబీఎస్, ఎంఎస్సీ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు ఎంప్లాయిమెంట్ చేయించాలంటే విద్యార్దులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. సెక్రటేరియట్, జిల్లా మంత్రులు, ఇతర మంత్రులు రోజు గుంటూరు, విజయవాడ మీదుగా రాకపోకలు సాగి స్తున్న విద్యార్దులు కష్టాలు పట్టించుకొవడంలో ప్రభుత్వం విఫలం చెందిందనే చెప్పాలి.
ప్రొఫెషనల్ కోర్సులకు ఎంప్లాయిమెంట్ చేయించాలంటే విశాఖపట్నం జిల్లాలోని ఆంధ్రా యూనివర్సీటి, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటిలో మాత్రమే ఎంప్లాయిమెంట్ చేయించాల్సి రావడంతో ఇతర జిల్లాలకు చెందిన కొన్ని లక్షల మంది ప్రొఫెషనల్ కోర్సులు చేసినవారు అంతదూరం పోలేక,ఆర్ధిక ఇబ్బందులు తలత్తడంతో చాలామంది విద్యార్దులు ఎంప్లాయిమెంట్ చేయించడానికి వెనుకడగు వేస్తున్నారు.
జిల్లాలో కేవలం డీగ్రీ వరకు మాత్రమే ఎంప్లాయిమెంట్
జిల్లాలో కేవలం 10వ తరగతి, ఇంటర్, డిప్లోమో, ఐటిఐ, ఎఎన్ఎం, జీఎన్ఎం, డీగ్రీ వంటి కోర్సులకు మాత్రమే ఎంప్లాయిమెంట్ చేయించుకునే అవకాశం జిల్లాలో కల్పిస్తున్నారు. ప్రొఫెషనల్ కోర్సుల్లో పాసైనా వారు ప్రతి సంవత్సరం జిల్లా నుండే లక్షల సంఖ్యలో విద్యార్దులు ఉంటున్నారు. వీరు విశాఖపట్నం, తిరుపతిలకు పోవడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. చిన్న స్థాయి చదువులకు ఎంప్లాయిమెంట్ చేయిస్తే జాబులు రాని పరిస్థితి నెలకొంటే అక్కడకు వెళ్ళి చేయించుకున్నా జాబులు వస్తాయో రావో అని విద్యార్దులు అయోమయంలో ఉన్నారు.
ఏఎన్యూలో ఏర్పాటు చేస్తే అందరికీ అనువు
నూతనంగా ఏర్పడిన రాజధాని ప్రాంతంలో ఎంప్లాయిమెంట్ కార్యాలయం ద్వారా ఉద్యోగవకాశాలు లభిస్తాయో అని ప్రొఫెషనల్ కోర్సులు చదివినటువంటి వారు జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయానికి తమ సర్టిఫికేట్లు తీసుకురావడం తీరా వచ్చాక ఇక్కడ లేదని ఎంప్లాయిమెంట్ సిబ్బంది చెప్పడంతో చేసేదిమి లేక అంత దూరం వెళ్ళి ఎంప్లాయిమెంట్ చేయించుకొవడానికి ఆర్దిక స్తోమత లేక ఇంటర్, వంటి చిన్న కోర్సుల వరకే ఎంప్లాయిమెంట్ చేయించుకొని వెళుతున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కలిపి దగ్గరలో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటిలో ఏర్పాటు చేస్తే ఎంప్లాయిమెంట్ చేయించుకొవడానికి వీలుగా ఉంటుందని విద్యార్థులు కోరుతున్నారు.
ఏఎన్యూలో చేయడానికి ప్రభుత్వ ప్రతిపాదన ఉంది
మా దగ్గరకు రోజూ ప్రొఫెషనల్ కోర్సులు చదివిన విద్యార్థులు ఎంప్లాయిమెంట్ చేయాలని వస్తున్నారు. కాని ప్రొఫెషనల్ కోర్సులకు ఇక్కడ లేదని, విశాఖపట్నం కాని, తిరుపతికి కాని వెళ్లాలని సమాధానం ఇస్తున్నాం. ఏఎన్యూలో ఎంప్లాయిమెంట్ చేయించడానికి ప్రభుత్వం ప్రతిపాదన ఉంది. కాని ఇంకా అమలు కాలేదు.
– డాక్టర్ కె.రజనీప్రియ జిల్లా ఉపాధికల్పన అధికారి
అంతదూరం వెళ్లలేక పోతున్నాం
బీటెక్ 2014లో పాసయ్యాను. బీటెక్ డిగ్రీని ఎంప్లాయిమెంట్ చేయిద్దామని గుంటూరు ఎంప్లాయిమెంట్ కార్యాలయానికి వచ్చాను. కాని ఇక్కడ అధికారులు ఇక్కడ కాదు వైజాగ్ గాని తిరుపతి గాని వెళ్లాలని చెప్పడంతో చేసేదేమీ లేక అంతదూరం వెళ్లలేక ఎంప్లాయిమెంట్ చేయించలేదు. చిన్నచిన్న జాబులు చేసుకునే వాళ్లు సెలవులు పెట్టి అంతదూరం వెళ్లి ఎంప్లాయిమెంట్ చేయించుకోవడం చాలా కష్టం.
–సీహెచ్ కిరణ్కుమార్(బీటెక్)