ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష
కాకినాడ సిటీ : ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు జాబితా, మార్పులు, చేర్పులు తదితర అంశాలను పరిశీలించేందుకు బూత్స్థాయి ఏజెంట్లను రాజకీయ పార్టీలు తక్షణమే ఏర్పాటు చేసుకోవాలని ఓటర్ల జాబితా పరిశీలకురాలు అనితా రాజేంద్ర అన్నారు. కలెక్టరేట్లో ఓటర్ల జాబితా సవరణ అంశంపై కలెక్టర్ నీతూ ప్రసాద్, జేసీ ముత్యాలరాజుతో కలిసి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎలక్ట్రోరల్ అధికారులతో ఆమె బుధవారం సమీక్ష నిర్వహించారు. నకిలీ ఓటర్లను, చనిపోయిన ఓటర్ల విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తరువాత మాత్రమే వాటిని జాబితా నుంచి తొలగించాలని ఆమె ఆదేశించారు. అధికంగా క్లైంలు వచ్చిన చోట 20 శాతం పోలింగ్ కేంద్రాల్లో మరింత పరిశీలన జరపాలని సూచించారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ హోప్ ఐలాండ్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ప్రతిపాదనలు పంపగా మంజూరైందని వివరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ఈ నెల 23వరకు గడువు పెంచామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, సీపీఎం నాయకుడు టీఎస్ప్రకాష్ సమీక్షలో పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు