ఎన్నికలకు బదులు ఎంపికలు
సాగునీటి సంఘాల్ని కార్యకర్తలతో నింపాలని టీడీపీ ఎత్తుగడ
నేడు కేబినెట్ ముందుకు ప్రతిపాదన
హైదరాబాద్: సాగునీటి సంఘాలను దొడ్డిదారిన కార్యకర్తలతో నింపేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనువుగా సాగునీటి సంఘాల చట్టానికి సవరణ చేసి ‘ఓటరు- ఎన్నిక నిర్వహణ’ నిర్వచనాన్నే మార్చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం జన్మభూమి కమిటీ సభ్యులు, పంచాయతీ వార్డు సభ్యులు కలసి సాగునీటి సంఘాల సభ్యుల్ని ఎంపిక చేసేందుకు వీలుగా చట్టాన్ని సవరించనున్నారు. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనకు శుక్రవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర పడనుందని తెలిసింది. అనంతరం ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది.
సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా పార్టీ కార్యకర్తల్ని నామినేట్ చేయడానికి ‘ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ యాక్ట్’ అంగీకరించదు. ఈ నేపథ్యంలో ఒకవేళ కార్యకర్తల్ని నామినేట్ చేసినా న్యాయపరమైన చిక్కులొస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ బ్యాంకు నిధులను వాడుకోవాలంటే సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం మినహా మరో మార్గం లేదు. అరకొర చెల్లింపులే తప్ప రుణమాఫీ హామీ విషయంలో చేతులెత్తేయడంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిపితే టీడీపీ చిత్తుగా ఓడిపోతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.