8 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ నెల 9వ తేదీన పోలింగ్ జరిగిన మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలతోపాటు ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరిగిన కర్నూలు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 102 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.
ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా జిల్లాల అధికార యంత్రాగాలు పటిష్ట ఏర్పాట్లు చేశాయి. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం లోపే వెలువడనున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు మాత్రం సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్నూలు, నెల్లూరు స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో కేవలం టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థులే పోటీ పడగా, వైఎస్సార్ జిల్లాలో టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థులతోపాటు మరో ఎనిమిదిమంది స్వతంత్రులు కూడా పోటీపడ్డారు.
►నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో
►ఆనం విజయ్ కుమార్ రెడ్డి (వైఎస్ఆర్ సీపీ), వాకాటి నారాయణరెడ్డి (టీడీపీ)
►వైఎస్ఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
►బరిలో వైఎస్ వివేకానందరెడ్డి (వైఎస్ఆర్ సీపీ), బీటెక్ రవి (టీడీపీ)
►కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు
►గౌరు వెంకటరెడ్డి (వైఎస్ఆర్ సీపీ), శిల్పా చక్రపాణిరెడ్డి (టీడీపీ)
అలాగే శ్రీకాకుళం–విజయ నగరం–విశాఖ జిల్లాల పట్టభద్రుల స్థానంలో 30 మంది పోటీ చేశారు. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గంలో 14 మంది బరిలో నిలిచారు. అనంతపురం–వైఎస్సార్–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గంలో 25 మంది పోటీ పడ్డారు. ప్రకాశం– నెల్లూరు–చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో తొమ్మిది మంది,అనంతపురం–కర్నూలు–వైఎస్సార్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
►శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ (పట్టభద్రులు)
►అజయ్ శర్మ (పీడీఎఫ్), మాధవ్ (టీడీపీ)
►ఆదిరాజు (కాంగ్రెస్), రమణమూర్తి (స్వతంత్ర అభ్యర్థి)
►ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు (పట్టభద్రులు)
►యెండపల్లి శ్రీనివాసరెడ్డి (పీడీఎఫ్), వేమిరెడ్డి పట్టాభిరెడ్డి (టీడీపీ)
►ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు (టీచర్)
►విటపు బాలసుబ్రహ్మణ్యం (పీడీఎఫ్), వాసుదేవనాయుడు (టీడీపీ)
►అనంతపురం-కర్నూలు-వైఎస్ఆర్ జిల్లా (పట్టభద్రులు)
►గోపాల్ రెడ్డి (వైఎస్ఆర్ సీపీ), కేజే రెడ్డి (టీడీపీ), డా.గేయానంద్ (పీడీఎఫ్)
►అనంతపురం-కర్నూలు-వైఎస్ఆర్ జిల్లా (టీచర్)
►బత్తుల పుల్లయ్య (టీడీపీ), కత్తి నరసింహారెడ్డి (ఉపాధ్యాయ సంఘం నేత)