టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు కృషి
కర్నూలు(అర్బన్): కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఆదివారం స్థానిక షరాఫ్ బజార్ కల్యాణ మండపంలో చేనేత వర్గ సమాజ బంధువుల ఆధ్వర్యంలో ఎంపీ దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్థానిక పాతబస్టాండ్ సమీపంలోని డా.బీఆర్ అంబేద్కర్, కొండారెడ్డిబురుజు సర్కిల్లోని తెలుగుతల్లి విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి ప్రదర్శనగా వేదిక వద్దకు చేరుకున్నారు.
కుర్ని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ.. పీపీపీ మోడల్లో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు ఇటీవలే కేంద్ర మంత్రితో మాట్లాడానని, అందుకు వారు అంగీకరించారన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తాగు, సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ఎంపీ ముందుకు సాగాలని కుర్ని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు కోరారు.
సమావేశంలో వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు హఫీజ్ఖాన్, ఎస్ఎస్ హోండా అధినేత శివకుమార్, పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గడిగె ప్రసాద్, రిటైర్డు తహశీల్దార్ సీబీ అజయ్కుమార్, పోపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, కుర్ని, పద్మశాలి, తొగట వీర క్షత్రియ, దేవాంగ, స్వకులసాలె కులాలకు చెందిన నాయకులు నరహరి, వెంకటేశ్వర్లు, మాకం నాగరాజు, శింగరి చంద్రశేఖర్, వాసు, కస్తూరి ప్రసాద్, లక్ష్మినారాయణ, గుంపుల వెంకటేశ్వర్లు, కుర్ని బాంధవి మాసపత్రిక ఎడిటర్ పీజీకే వెంకటేశ్వర్లు, భావన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు