థర్మల్ రద్దయ్యే వరకు ఉద్యమం
సంతబొమ్మాళి: కాకరాపల్లి తంపరలో నిర్మిస్తున్న ఈస్ట్కోస్ట్ థర్మల్ ప్లాంటు రద్దయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీపీఎం రాష్ట్ర సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు అన్నారు. థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని వడ్డితాండ్రలో అమరవీరుల నాల్గో సంస్మరణ సభ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, థర్మల్ వ్యతిరేకోద్యమంలో పోలీసుల తూటాలకు బలైన జీరు నాగేశ్వరరావు, సీరపు ఎర్రయ్య, బత్తిన బారికివాడు ఆత్మకు శాంతి చేకూలా పోరు ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. చిత్తడి భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని రాజ్యాంగంలో ఉన్నా బడా పారిశ్రామిక వేత్తలకు ప్రజాప్రతినిధులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి పెద్దపెద్ద కంపెనీలకు దాసోహం అవుతున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో తీరప్రాంతాన్ని నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నార న్నారు. తప్పుడు నివేదికలతో ప్రజా వినాశనంలో అధికారులు కూడా భాగస్వాములయ్యారన్నారు. పర్యావరణానికి హాని కల్గిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలకు నష్టం కలిగించే థర్మల్ ప్లాంట్లు, కంపెనీలు ఉన్నంత వరకు పోరాటాలు, ఉద్యమాలు ఉంటాయన్నారు. పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలను నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబునాయుడు పరామర్శించి అధికారంలోకి వచ్చిన వెంటనే థర్మల్ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే మరచిపోయారని దుయ్యబట్టారు.
అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా 1108 జీవో రద్దయ్యే వరకు పోరాటం సాగిస్తామని, దానికి వామపక్షాల మద్దతు ఉంటుందన్నారు. అంతకు ముందు అమరవీరుల స్థూపానికి అమరవీరుడు బారికివాడు భార్య గున్నమ్మ, వామపక్ష నాయకులు, పోరాట కమిటీ నాయకు లు పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ జిల్లా అధ్యక్షుడు తాండ్ర ప్రకాష్, కార్యదర్శి ఎన్.వెంకటరావు, ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు నీలం రాజు, సీపీఐ జిల్లా నాయకుడు వెంకటరావు, పీడబ్ల్యూఎస్ నాయకురాలు ఎస్.కృష్ణవేణి, హెచ్.ఎన్.పేట సర్పంచ్ పాల మహేష్, లక్కివలస ఎంపీటీసీ సభ్యులు శ్రీరంగం రాజులు, పోరాట కమిటీ కన్వీనర్ అనంతు హన్నూరావు, పోరాట కమిటీ నాయకులు ఎస్.సోమేశ్వరరావు, పి.మేనకేతనరెడ్డి, ఎం.నర్సింగరావు, అనంతు దుర్యోధన, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.