డ్వాక్రాకు శాపం

డ్వాక్రాకు శాపం - Sakshi


- కనిపించని కార్పస్‌ఫండ్

- పెచ్చుమీరిన ‘పది’ వేల అబద్ధాలు!

- కొత్తరుణాలు ఇవ్వని బ్యాంకులు

- బలవంతపు వసూళ్లలో సక్సెస్

- బాబు ఏడాది పాలనలో డ్వాక్రా కకావికలం


చంద్రబాబు ఏడాది పాలన చిత్తూరు జిల్లాలోని డ్వాక్రా సంఘాలకు శాపంగా మారింది. ఎన్నికల హామీలు.. రుణమాఫీ దేవుడెరుగు ఒక్కో సభ్యురాలికి ఇస్తామన్న రూ.10వేల హామీ ఇప్పటికీ నెరవేరలేదు. కొత్తరుణాలు పుట్టక.. ఉన్న రుణాలు కట్టలేక డ్వాక్రా మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు.

 

సాక్షి,చిత్తూరు: జిల్లాలో డ్వాక్రా సంఘాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. బాబు ఎన్నికల హామీల పుణ్యమా అని గత ఏప్రిల్ నుంచి బ్యాంకు లావాదేవీలు నిలిచిపోయాయి. కొత్త రుణాలు పుట్టక.. పాత రుణాలు కట్టలేక డ్వాక్రా మహిళలు కుమిలిపోతున్నారు.



మాఫీ మాయలో..

జిల్లాలో మొత్తం 62,792 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఇందులో 58,602 గ్రూపులు బ్యాంకుల లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ప్రతినెలా జిల్లాలో 89 శాతం గ్రూపులు * 100 కోట్లు కడుతున్నాయి. చంద్రబాబు రుణమాఫీ ఆశతో చాలా గ్రూపులు బ్యాంకులకు రుణాలు సక్రమంగా చెల్లించక పోవడంతో వడ్డీలు పేరిగాయి. నిబంధనల మేరకు మూడు నెలలపాటు బకాయిలు చెల్లించకపోతే అధిక వడ్డీ పడడమేగాక వడ్డీలేని రుణానికి అర్హత కోల్పోతారు. ప్రస్తుతం చాలా గ్రూపులు ఇదేపరిస్థితినెదుర్కొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10,484 గ్రూపులకు సంబంధించి * 58 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 7,436 గ్రూపులు 3 నెలలుగా *147 కోట్లను కట్టలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.



బలవంతపు వసూళ్లు

రుణమాఫీ సంగతి పక్కన పెట్టిన ప్రభుత్వం జిల్లాలో బలవంతంగా రుణవసూళ్లకు పాల్పడుతోంది. వెలుగు అధికారులు, బ్యాంకర్లు కలిసి రుణాలు చెల్లించిన వారికే రుణమాఫీ అమలు చేస్తామని నమ్మబలికి డ్వాక్రా మహిళలను బోల్తా కొట్టిస్తున్నారు. కొన్నిగ్రూపుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. పాతబకాయిలకు సంబంధించి రీపేమెంట్ చేయకపోతే అధికవడ్డీలు వసూళ్లు చేయాల్సివస్తుందని, కొత్తరుణానికి జీరో వడ్డీ వర్తించదంటూ భయపెట్టేందుకు తెగబడ్డారు. రూ.5 లక్షలకు నెలకు రూ.5వేల వడ్డీ చెల్లించాల్సందేనంటూ బెదిరింపులకు సైతం దిగి 98 శాతం రుణాలను ముక్కుపిండి వసూలు చేశారు.



బకాయిల‘కొండ’

జిల్లాలో మొత్తం 7 లక్షల 80 వేలమంది సభ్యులున్నారు. 2014-15 కుంబంధించి రూ.1513 కోట్లు ఇవ్వగా 2013-14లకు రూ.1387 కోట్లు ఇచ్చారు. ఇప్పటికే గ్రూపులు చెల్లించక పోవడంతో రూ.157 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. గడువులోపు చెల్లించక నిలిచిపోయిన బకాయిలు మరో రూ.55 కోట్లు ఉంది. మొత్తంగా పాత బకాయిలు 1,596 కోట్లు పైనే ఉన్నట్లు తెలుస్తోంది.



రూ.10వేలు ఏమైంది బాబూ..

సీఎం హామీలు.. నీటిమూటల్లా మారాయి. ఒక్కో మహిళకు రూ.10 వేలు ఇస్తామని నమ్మబలికారు. ఆయనపాలన ఏడాదిగడుస్తున్నా పైసా ఇవ్వలేదు. జిల్లాలో 7లక్షల 80 వేల మంది సభ్యులకు ఒక్కొక్కరికీ రూ.10 వేల వంతున మొత్తం రూ.780 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చెల్లించలేక టీడీపీ ప్రభుత్వం చతికిల పడింది.



పైసా పుడితే ఒట్టు

గత ఏడాది జిల్లాలోని 39,225 గ్రూపులకు రూ.1,513 కోట్లు రుణాలు మంజూరు చేశారు. మిగిలిన 19,377 గ్రూపులకు రుణాలు ఇవ్వలేదు. ఏప్రిల్ తరువాత ఈ ఏడాదికిగాను బ్యాంకులు ఒక్క పైసా రుణం ఇవ్వలేదు. డ్వాక్రా మహిళలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. గత ఏడాది జిల్లాలోని 39,225 గ్రూపులకు రూ.1,513 కోట్లు రుణాలు మంజూరు చేశారు. మిగిలిన 19,377 గ్రూపులకు రుణాలు ఇవ్వలేదు. ఏప్రిల్ తరువాత ఈ ఏడాదికి గాను బ్యాంకులు ఒక్క పైసా రుణం ఇవ్వలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top