డ్వాక్రా రుణమాఫీకి.. హైటెక్ షరతులు!


- సంఘంలో ఒక్కో సభ్యురాలికి ఇచ్చేది మూడువేలే

- దానికీ సవాలక్ష ఆంక్షలు

- మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

- జిల్లాలో 1.1లక్షలమంది మహిళలకు నిరాశ

- భగ్గుమంటున్న డ్వాక్రా సభ్యులు


డ్వాక్రా రుణమాఫీకి సీఎం చంద్రబాబు హైటెక్కు సోకులు అద్దారు. సంఘంలో ఒక్కో మహిళకు రుణమాఫీ కింద రూ. 10వేలు ఇస్తామన్న బాబు ఇప్పుడు రూ. 3 వేలు అప్పుగా విదిల్చేందుకు సిద్ధమయ్యారు. ఆ మొత్తాన్ని ముట్టుకోవద్దని షరతు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.



చిత్తూరు (అర్బన్) : నిన్న మొన్నటి వరకు డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకూ రుణమాఫీ కింద రూ.10 వేలు చెల్లిస్తామని చెప్పుకొచ్చిన ప్రభుత్వం తాజాగా అందుకు షరతులు పెట్టింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని మహిళా సంఘాలకు రూ.10 వేలకు బదులు తొలి విడతగా రూ.3వేలే ఇస్తామని, దాన్ని కూడా అప్పుగా తీసుకోవాలని ఆదేశించింది.



గత ఏడాది ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. తొలుత అప్పు మొత్తం మాఫీ చేస్తానని చెప్పి చివరకు ప్రతి మహిళకూ రూ.10వేలు ఆమె వ్యక్తిగత ఖాతాకు జమ చేస్తామని నమ్మబలికారు. అయితే రెండు రోజుల కిందట మహిళా సంఘాలకు సంబంధించి రుణమాఫీ విధి విధానాలపై ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ద్వారా ఓ సర్కులర్ (నం-2095/2015)ను జారీ చేసింది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ సర్కులర్  అందింది.



జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో మొత్తం 12,117  మహిళా సంఘాలుండగా, వీటిల్లో 1,19,131 మంది సభ్యులుగా ఉన్నారు. చిత్తూరు కార్పొరేషన్‌లో 2083 సంఘాలు, తిరుపతిలో 3842, మదనపల్లెలో 1694, నగరిలో 945, పలమనేరులో 825, పుంగనూరులో 824, పుత్తూరులో 891, శ్రీకాళహస్తిలో 1013 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు ఒక్కో సంఘంలోని సభ్యురాలికి రూ.10 వేల చొప్పున రూ.12.11 కోట్లు విడుదల చేయాలి. కానీ ప్రస్తుతం ప్రతి సభ్యురాలికి రూ.3 వేలు చొప్పున రూ.3.63 కోట్లు మాత్రమే ఇస్తామని.. అది కూడా మహిళలు తాకడానికి వీల్లేదని షరతులు పెట్టింది.



రూ.10వేలు మూడు విడతల్లో మహిళలకు చెల్లిస్తామని, దీన్ని అప్పుగానే తీసుకోవాలని పేర్కొంది. బ్యాంకుల్లో కొత్త అప్పులు తీసుకునేటప్పుడు సంఘ నిధి కింద ప్రభుత్వం విడుదల చేసిన మొత్తాన్ని చూపించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.



షరతులు ఇవీ..

- గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి డ్వాక్రా సంఘంలో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే రూ.3 వేలు ఇస్తారు.

- సంఘంలో సభ్యురాలిగా ఉంటూ మొబైల్ బుక్ కీపింగ్ డేటాబేస్‌లో వారి పేరు లేకుంటే రూ.3 వేలు ఇవ్వరు. ఆధార్ కార్డు నంబరును ఆన్‌లైన్‌లో సీడింగ్ చేయకపోయినా అనర్హులవుతారు.

- ఈ డబ్బును నేరుగా సభ్యులకు ఇవ్వరు. సభ్యుల వ్యక్తిగత ఖాతాలో జమ చేయరు. సంబంధిత గ్రూపు సంఘంలో జమ చేస్తారు. దీన్ని సభ్యులు అప్పు రూపంలోనే తీసుకోవాలి. పంచుకునేందుకు వీల్లేదు.

- రూ.3 వేలు తీసుకున్న ప్రతి మహిళా దీనికి వడ్డీ కడుతూ ఉండాల్సిందే.

- ఈ నెల 22వ తేదీలోపు మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి ఈ విషయాలను తెలియజేస్తారు.

- వచ్చే నెల 3వ తేదీ నుంచి సంఘం ఖాతాలో ఒక్కో సభ్యురాలికి రూ.3వేలు చొప్పున సంఘానికి గరిష్టంగా రూ.30వేలు చెల్లిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top