డ్యూటీ పాస్‌ల దుర్వినియోగం


  •  ఫేస్‌బుక్‌లో కామెంట్స్

  • విజయవాడ : దసరా ఉత్సవాల సందర్భంగా వివిధ విభాగాలకు కేటాయించిన డ్యూటీ పాస్‌లు ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయనే దానిపై బుధవారం ఫేస్‌బుక్‌లో కథనాలు హల్‌చల్ చేశాయి. శానిటేషన్, క్యూలైన్లు, మంచినీటి ప్యాకెట్ల సరఫరాతో పాటు ప్రసాదాలను కిందకు తీసుకువెళ్లే సిబ్బందికి డ్యూటీ పాస్‌లను ఆలయ అధికారులు కేటాయిస్తున్నారు. వీరితో పాటు పాతబస్తీకి చెందిన పలువురు వ్యాపారులు, ఆలయ సిబ్బందితో పరిచయాలు ఉన్న  వారికి ఈ డ్యూటీ పాస్‌లను కేటాయిస్తున్నారు.  



    వీటిని కేవలం దర్శనానికి మాత్రమే వినియోగిస్తున్న వైనంపై బుధవారం ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌లు కనిపించాయి. ఓ  స్నేహితుడి నుంచి డ్యూటీ పాస్‌ను తీసుకున్న వ్యక్తి రాజమార్గంలో అమ్మవారిని దర్శించుకుని తన్మయానికి గురయ్యాడు.  అమ్మవారి దర్శనంలో  తనకు కలిగిన అనుభవాన్ని కార్డు ఇచ్చిన స్నేహితుడికి తెలుపుతూ ఫేస్‌బుక్‌లో  కామెంట్ పెట్టాడు. ‘వీఐపీల దర్శనం కూడా రద్దు చేసిన రోజున డ్యూటీ పాస్‌తో కేవలం 15 నిమిషాల్లో అమ్మవారి దర్శనం చేసుకునేలా కార్డు ఉపయోగపడిందంటూ’ పాతబస్తీకి చెందిన ఓ ఇద్దరు స్నేహితులు కామెంట్లు పెట్టుకున్నారు.



    అంతరాలయంలోని క్యూలైన్ మార్గంలో డ్యూటీ కోసం కేటాయించిన కార్డులలోనే  ఎక్కువగా ఈ వ్యవహారం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.  డ్యూటీ పాస్‌లను ఎక్కువగా రాత్రి  8 గంటల నుంచి 11 గంటల మధ్య వినియోగిస్తున్నారు. డ్యూటీ పాస్‌లను కేటాయించే  ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరించడంతోనే ఈ పరిస్థితికి కారణమని వినికిడి.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top