మహానాడులో విరాళాల వెల్లువ
తిరుపతి సిటీ: మహానాడులో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీకి విరాళాలు ప్రకటించారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి రూ.25 లక్షలు ప్రకటించారు. టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి రూ.5 లక్షల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. పర్వీన్బాబీ అనే మైనారిటీ మహిళ రూ.25 లక్షల విలువజేసే స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను సీఎంకు అందజేశారు.
పార్టీ సభ్యత్వ స్వీకరణ
మహానాడు కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం గుర్తింపు కార్డు ధరించి లోనికి వెళ్లారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, పలువురు పార్టీ నేతలు శుక్రవారం పార్టీ సభ్యత్వం స్వీకరించారు. సభ్యత్వం స్వీకరించిన వారిలో కేంద్రమంత్రి సుజనా చౌదరి, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మోత్కుపల్లి నరసింహులు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మంత్రి కొల్లు రవీంధ్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన సీఎం
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.