ఆడపిల్ల జన్మించిందని..

ఆడపిల్ల జన్మించిందని.. - Sakshi


- కాపురానికి వద్దంటున్నాడు

- గ్రీవెన్స్‌లో బాధితురాలి నివేదన

గుంటూరు క్రైం:
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ జరిగింది. రూరల్ ఎస్పీ కె.నారాయణ నాయక్ మొత్తం 32కు పైగా అందిన ఫిర్యాదులను పరిశీలించారు. ముందుగా పోలీసుస్టేషన్‌లలో న్యాయం జరగని పక్షంలో ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయాలని బాధితులకు సూచించారు. సివిల్ వివాదాలలో పోలీసుల ప్రమేయం ఉండదని, బాధితులు గుర్తించాలని ఆయన చెప్పారు. బాధితుల సమస్యల్లో కొన్ని వారి మాటల్లోనే..

 

ఎస్‌ఐ రూ. 5 వేలు తీసుకున్నారు...

- పి.శ్రావణి, పెనుగుదురుపాడు, చుండూరు మండలం


పెదకాకాని మండలం వెనిగళ్ల గ్రామానికి చెందిన పాటిబండ్ల డేవిడ్ రాజుతో 2011లో వివాహం జరిగింది. పెళ్లయిన ఏడాదికే ఆడపిల్లలకు జన్మనిచ్చానని, కాపురానికి తీసుకువెళ్లేందుకు నా భర్త నిరాకరించాడు. చుండూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నా భర్త , బంధువులను పిలిపించి మాట్లాడారు. నా కాపురం చక్కదిద్దుతానని చెప్పి విధుల్లో ఉన్న ఎస్‌ఐ నా వద్ద రూ.5 వేలు నగదు తీసుకున్నాడు. నా భర్తకు కౌన్సిలింగ్ నిర్వహించకపోగా నాకు న్యాయం చేయలేదు.

 

మోసం చేశారు...

- సామ నాగేశ్వరరావు, బోస్‌రోడ్డు, తెనాలి


చిలకలూరిపేటలోని కొమరవల్లిపాడుకు చెందిన మురికిపూడి ప్రదీప్‌కుమార్ హైదరాబాద్‌లో జయహూ ట్రేడర్స్ పేరుతో సెల్‌రీఛార్జి టాప్‌అప్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాడు. అతని వద్ద రెండేళ్ల నుంచి ప్రతినెలా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య టాప్‌అప్ బ్యాలెన్స్ చేయిస్తూ అతని అక్కౌంట్‌లో నగదు చెల్లిస్తూ ఉంటాము. ఈ క్రమంలో గత ఏడాది జులైలో రూ.2 లక్షలు చెల్లించగా బ్యాలెన్స్ వేయకుండా మోసం చేశాడు. ఏడాదిగా పలుమార్లు తన డబ్బు ఇవ్వాలని కోరినా పలుసాకులు చెబుతూ వచ్చాడు.

 

నాయ్యం చేయండి...

నా భర్త సత్యానందం ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. నాకు ఇద్దరు కుమారులు. నాకు ఎకరం పొలం, ఇల్లు ఉంది. నా భర్త చనిపోయిన అనంతరం ఆస్తులను నా పేరుతో మారుస్తున్నాని నమ్మించి ఆస్తులను నా పెద్దకుమారుడు పేరుతో రాయించుకున్నాడు. ఇటీవల విషయం తెలిసి నిలదీయడంతో ఆస్తిలో వాటాలు ఇచ్చేది లేదని తేల్చిచెప్పాడు. విచారించి న్యాయం చేయాలి.

- పి.రాణి, ఐతానగర్, తెనాలి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top