'టీచర్ని వేధించిన డైరెక్టర్'
తన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలపై.. స్కూల్ డైరెక్టర్ అసభ్య వ్యాఖ్యలు చేశాడంటూ.. ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన గుంటూరుజిల్లా నరసరావు పేటలో గురువారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం...
మండలంలోని అల్లూరివారిపాలెం రోడ్డులో గల హిందూ స్కూల్లో బరంపేటకు చెందిన షేక్ హసీమా ఆరేళ్లుగా పనిచేస్తోంది. రోజూ లాగే.. బుధవారం స్కూల్ కి వచ్చిన హసీమా.. సంతకం పెట్టేందుకు కార్యాలయంలోకి వెళ్లింది. ఈ సమయంలో స్కూల్ డైరెక్టర్ పీ.వీ. రావు హసీమాను పిలిచి.. గతంలో ఆమె తీసుకున్న శాలరీ అడ్వాన్స్ గురించి మాట్లాడారు.
తీసుకున్న అడ్వాన్స్ ఎలా తీర్చగలవు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె భర్త గురించి కూడా ఆరా తీసిన డైరెక్టర్ అసభ్యంగా మాట్లాడారు. మనస్తాపం చెందిన ఆమె ఏడుస్తూ.. ఇంటికి వెళ్లిపోయింది. స్కూల్ నుంచి అర్థాంతరంగా ఇంటికి వచ్చిన హసీమాను కుటుంబ సభ్యులు ఏమైందంటూ అడిగా.. డైరెక్టర్ వ్యవహరించిన తీరును చెప్పడంతో.. ఆగ్రహించిన కుటుంబ సభ్యలు గురువారం స్కూల్ వద్ద ఆందోళన చేశారు.
వీరు పాఠశాలలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సిబ్బంది అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డైరెక్టర్ పై లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేస్తామని తెలిపారు. అయితే.. పాఠశాల డైరెక్టర్ వచ్చి క్షమాపణ చెప్పాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనిపై స్పందించిన పాఠశాల డైరెక్టర్.. హసీమా తన కూతురితో సమానమని అన్నారు. గతంలో 15 వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకుందని.. మళ్లీ 10 వేల రూపాయలు అడిగిందని తెలిపాడు. స్టడీ అవర్ తో పాటు, ఆదివారాలు పనిచేసి అడ్వాన్స్ సొమ్ము తిరిగి తీర్చాలని మాత్రమే ఆమెకు సూచించినట్లు వివరణ ఇచ్చారు.