పత్రికల్లో అలా రాయిస్తారా: ధర్మాన

పత్రికల్లో అలా రాయిస్తారా: ధర్మాన - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు తన వైఫల్యాలను అధికారులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యకర్తలను చట్టాలకు అతీతంగా చూడాలని అధికారులకు చంద్రబాబు చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బాబు తన పాలనను గాడి తప్పించేవిధంగా తీసుకెళ్తున్నారని గతంలోనే చెప్పామని, ఇప్పుడు అదే నిజమైందన్నారు. అన్ని వ్యవస్థలను దిగజార్చారని అన్నారు. జన్మభూమి అనే కిరికిరి కమిటీలు పెట్టి బాబు రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని ధర్మాన ధ్వజమెత్తారు. పెన్షన్లు కూడా ఇవ్వలేని దుస్థితికి కలెక్టర్లను దిగజార్చింది వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు.



రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, లక్షల ఇళ్లు కట్టినట్టు పత్రికల్లో కథనాలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు మీకు భయపడి కేంద్ర సర్వీసులు వెళ్లింది వాస్తవం కాదా అని నిలదీశారు. సీఎం కార్యాలయం రాజ్యాంగేతర శక్తిగా మారిందని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. విద్య, వైద్యాన్ని వదిలేసి కార్పొరేట్‌ శక్తులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అన్ని సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసి అధికారులపై నెపం నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకుని ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని చంద్రబాబుకు ధర్మాన ప్రసాదరావు హితవు పలికారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top