గాలి బీభత్సం

గాలి బీభత్సం - Sakshi


జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్, రైల్వేకోడూరు : జమ్మలమడుగు, రైల్వేకోడూరు మండలాల్లో శుక్రవారం రాత్రి, శనివారం ఈదురు గాలులతో కూడిన వర్షం రైతులను చావు దెబ్బతీసింది. చేతికి వచ్చిన ఆరటి తోట నేలకు ఒరిగిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో  పడిపోయారు. జమ్మలమడుగు మండల పరిధిలోని 10 గ్రామాల్లో 22 ఇళ్లు పూర్తిగా, 39 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పి.బోమ్మెపల్లి, గూడెంచెరువు గ్రామాల్లోని రైతులు ముర్రామధుసూధనరెడ్డి తోటలో 3400 అరటి చెట్లు, టంగుటూరు పార్వతమ్మ తోటలో 2500, నాగశెట్టిగారి విజయలక్షి్ష్మ తోటలో ఆరువేలు, లక్షి్ష్మనారాయణ తోటలో 1500 చెట్లు నేలకొరిగాయి.



రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. పది రోజుల్లో పంట చేతికొస్తుండగా వాన గాలి ఇలా నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుచోట్ల భారీ వృక్షాలు పడిపోయి మూడు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జమ్మలమడుగు,మైలవరం, పెద్దముడియం మండలాల్లో ఈదురు గాలులకు 150 దాకా విద్యుత్ స్తంభాలు, 15 వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నట్లు విద్యుత్ శాఖాధికారులు వెల్లడించారు. పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. శనివారం ముమ్మరంగా మరమ్మతులు ప్రారంభించారు.



వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్దరిస్తామని ఏడి కృష్ణదేవా పేర్కొన్నారు. జమ్మలమడుగులోని రామిరెడ్డిపల్లె రహదారిలో గౌస్‌మోద్దీన్‌కు చెందిన నాలుగు వేల కోళ్లు, మైలవరం మండలం వేపరాల గ్రామంలో జ్యోతి రెడ్డికి చెందిన 1200 కోళ్లు మృతి చెందాయి. పెద్దపసుపల రహదారిలో ఉన్న బీఎల్‌ఆర్ గోదాము వీపరితమైన గాలుల ధాటికి పైకప్పు పూర్తిగా ఎగిరిపోయి రైతులు దాచుకున్న శనగ, జొన్నల బస్తాలు తడిసిపోయాయి. కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు రెవిన్యూ అధికారుల ప్రాథమిక అంచనా.



రైల్వేకోడూరు మండలంలో పచ్చని పొలాలు, పేదల ఇండ్లపై ప్రకృతి కన్నెర్ర చేసింది. శనివారం సాయంత్రం గాలి దెబ్బకు దాదాపు వంద ఎకరాలకు పైబడి అమృతపాణి  అరటి నేలమట్టం అయినట్లు బాదిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అరటి తోటల్లో కొన్ని చె ట్లు సగానికి విరగ్గా, మరికొన్ని చెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కోడూరు నుంచి చిట్వేలికి వెళ్లే దారిలో వీవీ కండ్రిక సమీపంలో ఉన్న ఓ భారీ వేప వృక్షం కూలిపోయింది. 



ఓబనపల్లె మొదలుకుని తిమ్మిశెట్టిపల్లె వరకు పలు చోట్ల వేప చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. సమీప గ్రామాల ప్రజలు రోడ్డుకు అడ్డం తొలగించారు. తురకపల్లె సమీపంలో అరటిలోడుతో వెళతున్న ఐచ ర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయింది. పిట్లావాండ్లపల్లెకు చెందిన సంటి శంకరమ్మ రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గాలికి పైనున్న రేకులు లేచి సమీపంలోని బొప్పాయి తోటలో పడిపోయాయని భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు.



వర్షం వచ్చిన సమయంలో తాము ఇంటిలోనే ఉన్నామని ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని, తేరుకుని చూసేలోపే రేకులు, పైపులు, ఫ్యానుతో సహా పంట పొలంలో పడిఉన్నాయన్నారు. ఇంటిలో ఉన్న సరుకులు, ఇతర సామగ్రి తడిచి ముద్దయ్యాయని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అదే గ్రామానికి చెందిన గంగయ్య ఇంటి రేకులు కూడా గాలికి కొట్టుకుపోయాయి. యానాదయ్య, మాజీ సర్పంచ్ వెంకటయ్య, సుబ్బయ్య, జయమ్మ తదితర దళిత రైతులకు చెందిన అరటి తోటలు ధ్వంసమయ్యాయి.



పొలాల్లోని కొబ్బరి చెట్లు సగానికి విరిగి పడ్డాయని వారు తెలిపారు. అనంతరాజు పేట పంచాయితీ తూర్పుపల్లెకు చెందిన పంజం వేణుగోపాల్ రెడ్డి, దేశు శ్రీనివాసులు రెడ్డి, దేశు మనోహర్ రెడ్డి, దేశఉ రవీంద్రారెడ్డి, శివశంకర్‌రెడ్డి తదితర రైతులకు చెందిన అరటి తోటలు దెబ్బతిన్నాయి. శివారెడ్డి ఇంటి రేకులు గాలికి కొట్టుకుపోయాయి. రైల్వేకోడూరులోని పలు వీధుల్లో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. రాత్రి 8 గంటగలైనా విద్యుత్ పునరుద్దరణ జరగలేదు. కాగా, దెబ్బతిన్న అరటి తోటలను వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్‌రెడ్డి పరిశీలించి భాదితులకు ధైర్యం చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top