డెర్మటాలజీ విభాగాభివృద్ధికి కృషి

డెర్మటాలజీ విభాగాభివృద్ధికి కృషి


కర్నూలు(హాస్పిటల్):

 రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో డెర్మటాలజీ విభాగాభివృద్ధితో పాటు టీచింగ్ ఫ్యాక్టల్టీ సంఖ్య పెంపునకు కృషి చేస్తామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజు అన్నారు. శనివారం స్థానిక కర్నూలు వైద్య కళాశాలలోని న్యూఆడిటోరియంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్టు, వెనిరి యాలజిస్టు, ల్యాప్రోలాజిస్టు ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో 33వ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వైద్యులు పాల్గొన్నారు.



జ్యోతి ప్రజ్వలన అనంతరం వైస్ ఛాన్స్‌లర్ మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని వైద్య కళాశాలల్లో టీచింగ్ సదుపాయాలను మెరుగు పరుస్తున్నట్లు చెప్పారు. డెర్మటాలజీ విభాగంలో టెక్నాలజీ పరంగా అభివృద్ధి ఎంతైనా అవసరమన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీలో 80వేల మంది సభ్యులు ఉన్నారని.. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యులే కీలక భూమిక పోషిస్తున్నారన్నారు.



ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో లైబ్రరీ విభాగాన్ని మరింత విస్తృతం చేసి 80 జర్నల్స్, 2వేల పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు(ఆంధ్రప్రదేశ్) డాక్టర్ జి.శాంతారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ విభాగాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కర్నూలులో చర్మ వ్యాధుల విభాగానికి కొత్త బిల్డింగ్ నిర్మించే దిశగా చర్యలు చేపడతామన్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఇటీవలే డాక్టర్ పోస్టుల భర్తీ చేపట్టామన్నారు. త్వరలోనే ప్రొఫెసర్ పోస్టుల భర్తీ పూర్తవుతుందన్నారు.



డెర్మటాలజీ వైద్యుల కొరత గ్రామీణ, రెవెన్యూ డివిజన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు(తెలంగాణ) మాట్లాడుతూ వయసును తగ్గించుకోవడంలో భాగంగా చర్మ సౌందర్యంపై అధిక శాతం ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ఇదే అదునుగా కొందరు బ్యూటీ క్లీనిక్‌ల పేరిట దోచుకుంటున్నారన్నారు. చర్మ వ్యాధులకు అర్హత కలిగిన వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స పొందాలని సూచించారు. కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఎస్.రాంప్రసాద్ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం డెర్మటాలజీలో సీటుపై ఆసక్తి కనబర్చే వారి సంఖ్య తక్కువగా ఉండేదని.. ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యత పెరిగిందన్నారు.



కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చర్మ వ్యాధులతో పాటు కాస్మొటిక్ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిం దన్నారు. సదస్సులో యువ వైద్యులు పాల్పంచుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం లభించిందన్నారు. అసోసియేషన్ నిర్వహణ చైర్మన్, కర్నూలు ప్రభుత్వాసుపత్రి చర్మ వ్యాధుల విభాగం అధిపతి డాక్టర్ ఐ.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ చర్మ వ్యాధుల విభాగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.



డ్రగ్స్ రియాక్షన్ కేసుల విషయంలో రోగులను ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదని.. ఈ కారణంగా ప్రభుత్వాసుపత్రిపై అధిక భారం పడుతోందన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి డాక్టర్ ఎస్.కొండారెడ్డి, కోశాధికారి డాక్టర్ వై.అరుణకుమారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జోజిరెడ్డి, కార్డియాలజిస్టు డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top