శివారు కష్టాలపై దృష్టేదీ ?

శివారు కష్టాలపై దృష్టేదీ ?


అమలాపురం :ప్రస్తుతం డెల్టా కాలువలు గుర్రపుడెక్క, తూడుతో నిండిపోయాయి. ఫలితంగా శివార్లకు నీరు సరిగా అందడం లేదు. ఒకవైపు సమయం మించిపోతున్నందున త్వరగా రబీ నాట్లు పూర్తి చేయాలని రైతులు పరుగులు పెడుతున్నా, జిల్లా అధికారయంత్రాంగం శివార్లకు నీరందించే ందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.జిల్లాలో తూర్పు, మధ్య డెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ)ల పరిధిలో సుమారు 3.50 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరుగుతుంది. సాగు ఆరంభంలోనే 16 టీఎంసీల నీటి కొరత ఉందని, రైతులు నీటి వినియోగంలో పొదుపు పాటించాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు. డిసెంబరు నెలాఖరుకు నాట్లు పూర్తి చేయని చేలకు చివరిదశలో నీరివ్వడం కష్టమని చెప్పారు. డెల్టాలతోపాటు పీబీసీ ఆయకట్టుకు సాగునీరందించే మేజర్, మీడియం చానళ్లు, మైనర్ కాలువల నిడివి సుమారు 3,500 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. వీటిలో 60 శాతం కాలువలు గుర్రపుడెక్క, తూడుతో పూడుకుపోయాయి. గోదావరిలో నీటి ఎద్దడి వల్ల కాలువలకు పూర్తి సామర్థ్యంతో నీరందించే అవకాశం తక్కువ. దీనికి తోడు కాలువలు పూడుకుపోవడంతో ప్రవాహం వడి మరింత తగ్గి శివార్లకు చేరడం ఇబ్బందే. మెరక రైతులు మోటార్లతో తోడుకోవడం తప్ప నీరు బోదెల ద్వారా పారే అవకాశం లేదు.

 

 రబీలో ఒక్క రూపాయి వెచ్చించలేదు..

 గోదావరి డెల్టాలో  కాలువల్లో పేరుకుపోయే గుర్రపుడెక్క, తూడు, ఇతర అవ రోధాల తొలగింపు చాలా కీలకం. ఏటా ఖరీఫ్, రబీ సాగుకు ముందు వీటిని తొలగిస్తుంటారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు వీటి తొలగింపు పనులను సకాలంలో చేపట్టి, నిధులు మంజూరు చేసేవారు. వీటి గురించి ఆలోచించే తీరిక ఇప్పటి అధికారులకు లేకుండా పోయింది. గత కొన్నేళ్లుగా ఈ పనులు సకాలంలో చేయడం లేదు. శివార్లకు నీరందక పోవడానికి ఇది ఒక కారణం. ఏటా రైతుల నుంచి వసూలు చేసే నీటి తీరువా రూ.15 కోట్లతో ఈ పనులు చేసే అవకాశముంది. అయితే ఈ ఏడాది కనీసం రూ.రెండు కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఖరీఫ్‌లో అక్కడక్కడా గుర్రపుడెక్క తొలగించినా కీలకమైన రబీలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. నీటి ఎద్దడి నేపథ్యంలో ఇప్పుడే పనులు చేయాల్సి ఉంది.

 

 మారిన నిబంధనతో ముదిరిన అలసత్వం

 గతంలో నీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు చేసి ధ వళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలోనే బిల్లు లు చేసేవారు. అయితే ప్రభుత్వం ఈ నిబంధన మా ర్చి నీటి తీరువా నిధులతో చేపట్టే పనులకు ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ అనుమ తి తప్పనిసరి చేసింది. నిధులు రాబట్టేందుకు అథారిటీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి, ఒప్పించే తీరికా, ఓపికా లేని స్థానిక ఇరిగేషన్ అధికారులు దానిపై  దృష్టిపెట్టడం లేదు. ఇదే సమయంలో నీటి సంఘా లు మనుగడలో లేకపోవడంతో నిధుల గురించి ఆరా తీసేవారు లేక చిన్నచిన్న పనులే పూర్తి కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు కాలువల్లో నీరు నిరాటంకంగా పారేలా చర్యలు తీసుకుని, రబీ సాగు సజావుగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top