108లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
కోట (గూడూరు) : దీపిక అను నిండు గర్భిణిని కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా 108లోనే ప్రసవించి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు.. చిట్టమూరు మండలం వెలిగాజులపల్లెకు చెందిన దీపికకు పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు కోట 108కు సమాచారం అందించారు.
దీంతో ఆమెను అత్యవసరంగా కోటకు తరలిస్తుండగా మార్గమధ్యలో రంగన్నగుంట సమీపంలో ఆమె వాహనంలోనే ప్రసవించింది. ఈఎంటీ మురళీ, పైలెట్ కిషోర్ ఆమెకు చికిత్స అందించి సుఖప్రసవం అయ్యేలా చూశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మగబిడ్డకు జన్మనివ్వడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఆమెను కోట వైద్యశాలకు తరలించారు.