రాష్ట్రానికి కర్మ పట్టింది!
♦ 30న ప్రత్యేక ప్యాకేజీపై సదస్సు
♦ కళ్యాణదుర్గం నుంచి పాదయాత్ర
♦ డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ ఎద్దేవా
అనంతపురం టౌన్ : తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రూపంలో రాష్ట్రానికి కర్మ పట్టిందని, ఏమి చేస్తే ఇది పోతుందో అర్థం కావడంలేదని డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యనారాయణ ఎద్దేవా చేశారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఈ ఏడాదికి సంబంధించి 13 జిల్లాలకు ఎంపీ ల్యాడ్స్ రూ.100 కోట్లు విడుదలయ్యాయన్నారు. అయితే ఎంపీలు ఈ నిధులను ఖర్చు చే యకుండా తొక్కిపెట్టారని ధ్వజమెత్తారు. ఉదయం లేస్తే సింగపూర్, మలేషియా అంటూ కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నారన్నారు. ఏడాది కాలంలో విదేశాలకు వెళ్లేందుకు ప్రజాధనం ఎంత ఖర్చు అయ్యింది.
అక్కడి నుంచి ఏ మేరకు పెట్టుబడులు తెచ్చారు. ఎన్ని పరిశ్రమలు ఏర్పాటుకు ఒప్పించారు. రాష్ట్రానికి ఏమి ప్రయోజనం చేకూర్చారో ప్రజలకు తెలిపేందుకు శ్వేతపత్రం విడుదల చే యాలని డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో ఈ నెల 30న ‘ప్రత్యేక ప్యాకేజీ’పై నిర్వహిస్తున్న సదస్సుకు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొంటారని అదే రోజు పార్టీ జిల్లా కమిటీని ప్రకటిస్తామన్నారు.
కరువు నివారణకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి దాదాపు 130 చెరువులకు నీరు ఇవ్వడమే ఏకైక పరిష్కామని, దీనికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తిలోదకాలిచ్చిందన్నారు. పాలకులకును మేల్కొల్పి వత్తిడి తీసుకొచ్చేందుకు 30న కళ్యాణదుర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించి జూన్ 1న కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటామన్నారు. రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజవంతం చేయాలిన కోరారు.