విద్యుదాఘాతంతో రైతు మృతి
కొల్లూరు (గుంటూరు): పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. తూమాటి వెంకటేశ్వరరావు అలియాస్ బుజ్జి (42) వరి పంటలో కలుపు తీయించేందుకు శనివారం ఉదయం చిలుమూరు-అనంతవరం గ్రామాల మధ్యఉన్న తన పొలానికి వెళ్లాడు.
నీరు తక్కువుగా ఉండటంతో మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న రైతులు గమనించి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.