‘అమరావతి.. మేకిన్ ఇండియా కాకూడదా?’
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి రాజధాని అమరావతిని మేకిన్ ఫారిన్గా మారుస్తున్నారని సీపీఎం నేత బీవీ రాఘవులు ఎద్దేవా చేశారు. రాజధాని మేకిన్ ఇండియాగా ఉండకూడదా అని ఆయన ప్రశ్నించారు. బుధవారం విజయవాడలో ‘రాజధాని నిర్మాణం- విదేశీ కంపెనీల పెత్తనం’ అంశంపై జరిగిన సదస్సులో ప్రసంగించారు. చైనా ప్రపంచస్థాయి నిర్మాణాలు చేస్తోందని చెబుతున్న సీఎం.. 30 ఏళ్ల క్రితం ఆదేశ పరిస్థితి ఏమిటనేది తెలుసుకోవాలన్నారు. సమస్త పనులను విదేశీ కంపెనీలకే అప్పగిస్తున్న చంద్రబాబు..దేశీయ కంపెనీలు మురికివాడల నిర్మాణానికే పరిమితమని చెప్పటం దారుణమని రాఘవులు అన్నారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టులు నిర్మించిన ఘనత భారతీయ కంపెనీలకు ఉందని చెప్పారు. అయినా ప్రభుత్వం వాటిని విస్మరిస్తోందని ఆరోపించారు. ఎల్అండ్టీ, షాపూర్ జీ పల్లోంజీ సంస్థలు నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణం కుంగిపోవడంపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.