ప్రత్యేక హోదా కోసం సెల్ టవరెక్కిన సీపీఐ నాయకులు


అనంతపురం : అనంతపురం జిల్లా కదిరిలో సోమవారం సీపీఐ నాయకులు రమణ, ముబారక్, నాగేంద్ర, మనోహర్‌లు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కారు. వారికి మద్దతుగా ఆ పార్టీకే చెందిన మరికొందరు నాయకులు కదిరి-బెంగుళూరు రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాస్తారోకో చేస్తున్న వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సెల్ టవర్ ఎక్కిన వారిని సైతం దిగిరావాలని కోరడంతో వారు కేంద్ర, రాష్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ దిగివచ్చారు. వారిని కూడా స్టేషన్‌కు తరలించి అనంతరం వారందరినీ సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.



ఈ సందర్భంగా సీపీఐ కదిరి డివిజన్ కార్యదర్శి వేమయ్యయాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో తాము గట్టిగా పట్టుబడితేనే అప్పటి యూపీఏ సర్కారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అనుమతించిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారని, ఇప్పుడెందుకు దాటవేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై కేంద్ర సర్కారును ఎందుకు గట్టిగా ప్రశ్నించడంలేదన్నారు. తెలుగుదేశం పార్టీ తక్షణం ఎన్‌డీఏ నుండి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ముస్తాక్, ఇలియాజ్, రమేష్, ఇషాక్, ఆదెప్ప, శ్రీనివాసులు, బాబు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top