పార్టీ ఫిరాయింపులు చూస్తుంటే ...
హైదరాబాద్: ఏపీ రాజధాని భూసేకరణ కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరీ రైతుల్లో అనుమానాలు కలిగించేలా ఉందని సీపీఐ ఆ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. డెవలపర్స్కు భూములు ఇస్తామనడం రియల్ ఎస్టేట్ను ప్రోత్సహించడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లో రామకృష్ణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాజధాని విషయంలో ప్రభుత్వానికి పారదర్శకత లేదని అన్నారు. రాజధాని అంశం పార్టీ వ్యవహారం కాదు... అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజకీయాలంటే అసహ్యం పుట్టేలా పార్టీలో ఫిరాయింపులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాలలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రామకృష్ణ పై విధంగా స్పందించారు. కరెంట్, విద్యుత్... తదితర సమస్యలు ఉత్పన్నమైతే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయా రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు రామకృష్ణ సూచించారు.