తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కమిటీ

తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కమిటీ - Sakshi


హైదరాబాద్: కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. లేక్వ్యూలో చంద్రబాబుతో ఎంపిల సమావేశం ముగిసింది. ఈ కమిటీకి కో ఆర్డినేటర్గా ఎంపి సుజనా చౌదరిని నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా అశోక్ గజపతి రాజు, తోట నరసింహం, మల్లారెడ్డి, కంభంపాటి రామ్మోహనరావు, బీజేపి ఎంపిలు కంభంపాటి హరిబాబు, బండారు దత్తాత్రేయ ఉంటారు.



విభజన బిల్లులోని అంశాల అమలుకు  కృషి చేయాలని ఎంపిలను చంద్రబాబు కోరారు. తుపాను కారణంగా భారీ నష్టం జరిగినందున  అధిక నిధులు రాబట్టడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.



సమావేశం ముగిసిన అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ  రాష్ట్రాభివృద్ధిపై చర్చించినట్లు తెలిపారు. విభజన సందర్భంగా ఏపికి ఇస్తామని చెప్పిన ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడినట్లు చెప్పారు. ఒక్కో ఎంపి తన నిధుల నుంచి కోటి రూపాయలను తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఖర్చు చేస్తారన్నారు. కమిటీ రాష్ట్రాలకు రావలసిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కృషి చేస్తుందని సుజనా చౌదరి చెప్పారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top