ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న కాంగ్రెస్: బాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవహారం కాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో అనిశ్చితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. రాజకీయ ప్రయోజనం కోసమే విభజనకు కాంగ్రెస్ పూనుకుందని దుయ్యబట్టారు. స్వలాభం కోసమే సమస్యను సృష్టించిందని ఆరోపించారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదని, ఎప్పటికైనా కాంగ్రెస్ దెబ్బతింటుందని అన్నారు.
56 రోజులుగా సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ ప్రభుత్వ కార్యాలయాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని అన్నారు. నీళ్లు, ఉద్యోగాలు, విద్యుత్, హైదరాబాద్ విషయాల్లో ప్రజలు అనుమానాలున్నాయని తెలిపారు. రాజకీయ కోణంలో చూడకుండా ప్రజల కోణంలో చూస్తే విభజన సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. జేఏసీలు, ప్రజాసంఘాల నాయకులతో చర్చలు జరపాలని సూచించారు. తనకు రెండు ప్రాంతాల ప్రజలు ముఖ్యమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దాలని రాష్ట్రపతిని కోరినట్టు చెప్పారు. జాతీయ నాయకులకు రాష్ట్ర పరిస్థితుల గురించి వివరించామన్నారు.