ఆళ్లగడ్డపై కాంగ్రెస్లో వీడని సందిగ్ధం


ఆళ్లగడ్డ ఉపఎన్నికలో  పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై కాంగ్రెస్‌ పార్టీలో ఇంకా స్పష్టత రాలేదు. స్థానిక రాజకీయాల గురించి క్షుణ్ణంగా చర్చించుకున్న కర్నూలు జిల్లా కాంగ్రెస్‌ నాయకులు... ప్రస్తుత పరిస్థితుల్లో బరిలోకి దిగరాదని భావిస్తున్నారు. ఇదే అంశాన్ని పీసీసీకి తెలియజేశారు. అయితే పోటీ చేయాలా.. వద్దా అనే విషయంపై హైకమాండ్‌ తుది నిర్ణయం తీసుకుంటుందని జిల్లా కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. పీసీసీ ఛీఫ్‌ రఘువీరా ఈ అంశంపై పార్టీ నేతలందరితో ఫోన్లో మంతనాలు జరుపుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో అందుబాటులో ఉన్న కాంగ్రెస్‌ నేతలతో సమావేశమై హైకమాండ్‌ సూచనల మేరకు పోటీ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారు.



అయితే పోటీకి అవసరమైన ఎ ఫామ్‌, బీ ఫామ్ ఇప్పటికే కర్నూలుకు చేరాయి. ఆళ్లగడ్డ ఉపఎన్నికకు నామినేషన్‌ దాఖలు చేసేందుకు తుది గడువు ఈ మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. ఒకవేళ పోటీచేయాలనుకుంటే మాత్రం మంగళవారమే నామినేషన్ దాఖలుచేయాల్సి ఉంటుంది. దాంతో తుది నిర్ణయం వెంటనే తీసుకోవాలి. సాధారణంగా ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే, ఆ స్థానంలో పోటీచేసే అభ్యర్థికి వ్యతిరేకంగా వేరేవారిని నిలబెట్టకూడదన్న సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీయే తొలుత మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top