4న కాంగ్రెస్ ధర్నా
రుణమాఫీ ఆంక్షలకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట ఆందోళన
ధర్నాకు రానున్న ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా
ఒంగోలు క్రైం : టీడీపీ ప్రభుత్వం రుణమాఫీపై పెట్టిన ఆంక్షలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టనుందని పీసీసీ జనరల్ సెక్రటరీ పీజేఆర్ సుధాకర్బాబు చెప్పారు. శుక్రవారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనల గురించి ఆయన వివరించారు. ఈ నెల 4వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించనున్న ధర్నాలో ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పాల్గొంటారని చెప్పారు.
ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలిచ్చిన చంద్రబాబు.. తీరా అధికారం చేపట్టిన తరువాత వాటిని తుంగలో తొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు కేంద్ర బిందువుగా ఉన్న ఒంగోలును కాదని, విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని అనువుగా ఉందని చెబుతూ రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించే ఆలోచనలు చేస్తున్నారని సుధాకర్బాబు విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, పీసీసీ కార్యదర్శి ఈదా సుధాకర్రెడ్డి, వేమా శ్రీనివాసరావు, కనకారావు మాదిగ, నిషాంత్, శశికాంత్ భూషణ్, లక్ష్మారెడ్డి, రసూల్, జావేద్ పాల్గొన్నారు.