బాబు సంతకాల్లో ఒక్కటీ అమలు కాలేదు

'బాబు సంతకాల్లో ఒక్కటీ అమలు కాలేదు' - Sakshi


  టీడీపీ గుర్తింపును రద్దు చేయండి :  గవర్నర్‌కు కాంగ్రెస్ వినతి

 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నందున టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయంలో చేసిన 5 సంతకాల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. ఆఖరుకు ఎన్నికల మేనిఫెస్టోనే టీడీపీ వెబ్‌సైట్ నుంచి తొలగించారని, ఇంతకంటే దారుణం మరొకటి లేదన్నారు. రైతు, డ్వాక్రా రుణ మాఫీపై పూటకో మాటతో చంద్రబాబు తప్పించుకుంటున్నారన్నారు. ఫలితంగా రాష్ట్రంలో 115 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వీరిలో అనంతపురం వారే 58 మంది ఉన్నారన్నారు.


మృతుల కుటుంబాలకు వెంటనే రూ.1.50 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ అవుతాయని నమ్మి రైతులు పంటల బీమా కోల్పోయారని, ఇందుకు టీడీపీ నేతలే కారణమని చెప్పారు. హుద్‌హుద్ తుపాను బాధితులకు కేటాయించిన రూ. కోట్ల రేషన్‌ను టీడీపీ నేతలు పక్కదారి పట్టించారన్నారు. రూ.185కే 9 రకాల సరుకులందించే అమ్మహస్తం పథకాన్ని రద్దు చేయడం అన్యాయమ న్నారు. 12 లక్షల మంది పింఛన్‌కు అనర్హులని సీఎం చెప్పడం విడ్డూరమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top