విశ్వవిద్యాలయాల ప్రక్షాళనకు చర్యలు : మంత్రి గంటా


ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి) : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయూలో సోమవారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల వీసీల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 12 అంశాలపై తీర్మానాలు చేశారు. ఆ వివరాలను మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.



గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ వల్ల మృతిచెందిన రిషితేశ్వరి సంఘటన నేపథ్యంలో ర్యాగింగ్ నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. విశ్వవిద్యాలయాల హాస్టల్‌లో ఉన్న బయటి వ్యక్తులను క్యాంపస్ నుంచి ఖాళీ చేయించి విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా విద్యార్థినులు, మహిళా అధ్యాపకులపై వేధింపుల నిరోధానికి చర్యలు తీసుకుంటామన్నారు. క్యాంపస్‌లోని భూములను పరిరక్షించేందుకు కమిటీని నియమించాలని నిర్ణయించామన్నారు. క్యాంపస్‌లో బయటి వ్యక్తులను హాస్టల్ నుంచి ఖాళీ చేయించాలని, క్యాంపస్‌లలో వైఫై, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని ఆగస్టు చివరికల్లా ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు.



కుల, మత సంఘాలను నిషేధిస్తున్నామన్నారు. గత ఏడాది డిసెంబర్ 18, 19తేదీల్లో ముఖ్యమంత్రి నిర్వహించిన వీసీల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను అమలుచేయాలని, యూనివర్సిటీల్లోని ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి నివేదిక రూపొందించాలని ఆదేశించామన్నారు. మూడు నెలలకొకసారి వీసీల సదస్సు నిర్వహించి సమస్యలపై చర్చించనున్నట్టు తెలిపారు. వచ్చే వీసీల సదస్సు అక్టోబర్ 9న కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో నిర్వహించాలని తీర్మానించామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top